AP News : జగన్ ప్రభుత్వం కమీషన్ల కోసం పారిశ్రామికవేత్తలను వేధించి, రాష్ట్ర అభివృద్ధిని పాతాళానికి తొక్కేసిందని ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు ఆరోపించారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గం చీపుర్లపాడులో రూ.10.51 కోట్లతో నిర్మించనున్న ఎంఎస్ఎంఈ పార్కుకు ఆయన ఇవాళ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అధికారంలో ఉండగా ‘నాకెంత.. నీకెంత’ అంటూ దోచుకున్న ఆ ‘గొడ్డలి పార్టీ’ కి గత ఎన్నికల్లో ప్రజలే సరైన బుద్ధి చెప్పారని, రాబోయే రోజుల్లో ఆ పార్టీ శాశ్వతంగా తుడిచిపెట్టుకుపోవడం ఖాయమని జోస్యం చెప్పారు.
గత ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్ భూములను ఆక్రమించుకోవాలని చూస్తే.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే సీఎం చంద్రబాబు కేంద్రంతో మాట్లాడి రూ.15 వేల కోట్లు మంజూరు చేయించి ఉక్కు పరిశ్రమను కాపాడారని అచ్చెన్నాయుడు తెలిపారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్ నాయకత్వంలో ‘స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ విధానంతో కేవలం 23 నెలల్లోనే రూ.23 లక్షల కోట్ల పెట్టుబడులను రాష్ట్రానికి ఆకర్షించామని, యువతకు 20 లక్షల ఉద్యోగాల కల్పనే తమ ప్రథమ ప్రాధాన్యమని చెప్పారు.
శ్రీకాకుళం జిల్లాలో వలసలను అరికట్టేందుకు పరిశ్రమల స్థాపన అవసరమని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. నియోజకవర్గ తాగునీటి సమస్యకు రూ.620 కోట్లు మంజూరు చేశామని చెప్పారు. జిల్లా ప్రజల 60 ఏళ్ల కల అయిన ‘నేరడి బ్యారేజీ’ ని 2029 నాటికి వంద శాతం పూర్తి చేసి జిల్లాను సస్యశ్యామలం చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు.