AP News : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో డీఎస్సీ, స్పోర్ట్స్ కోటా ఉద్యోగాల భర్తీ వ్యవహారం ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతోంది. ఈ అంశాలకు సంబంధించి వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పేర్ని నాని.. చంద్రబాబు ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. సీఎం చంద్రబాబు, మంత్రులు అనిత, కొల్లు రవీంద్రలను టార్గెట్ చేస్తూ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మచిలీపట్నం అసెంబ్లీ నియోజకవర్గ ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ అవగాహన సదస్సులో మాట్లాడిన ఆయన.. ప్రభుత్వానికి సవాల్ విసిరారు.
బియ్యం దొంగతనం చేసినట్లు తనపై ఆరోపణలు చేస్తున్నారని, మీకు నిజంగా దమ్ము, ధైర్యం ఉంటే నాపై విచారణ జరిపించి జైల్లో పెట్టాలని నాని సవాల్ చేశారు. 2029 నాటికి చంద్రబాబు ప్రభుత్వం కచ్చితంగా పడిపోతుందని, అంతవరకు మీకు చేతనైతే, దమ్ముంటే నన్ను అరెస్ట్ చేయాలని సంచలన వ్యాఖ్యలు చేశారు. స్పోర్ట్స్ కోటా నియామకాల్లో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని పేర్ని నాని ఆరోపించారు. ప్రభుత్వం మొదట క్రీడా కోటాను 3 శాతానికి పెంచుతూ జీవో ఇచ్చిందని, ఆ తర్వాత 382 మంది ఎంపికయ్యారని చెప్పిందని, కానీ ఇటీవలే ఆటల సంఖ్యను 29 నుంచి ఏకంగా 67 కి పెంచి అందులో ‘బ్రిడ్జ్’ (పేకాట) ను కూడా చేర్చారని విమర్శించారు.
ఎంపికైన అభ్యర్థుల జాబితాను గత 9 నెలలుగా ఎందుకు బహిరంగపరచడం లేదు..? ఐఏఎస్ అధికారి సంతకం కూడా లేకుండా ఆ లిస్ట్ను ఎలా విడుదల చేశారు..? ఇప్పుడు కార్డు గేమ్స్ (పేకాట) ఆడేవారిని ఎంపిక చేయలేదని ప్రభుత్వం ఎందుకు మాట మారుస్తోంది..? అని పేర్ని నాని ప్రశ్నించారు. డీఎస్సీ నియామకాల్లో జరిగిన భారీ అక్రమాలను కప్పిపుచ్చుకోవడానికే కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొట్టడానికి హోంమంత్రి అనితను ఒక కవచంలా వాడుకుంటోందని మండిపడ్డారు. రాష్ట్రంలో మహిళలు, బాలికలపై జరుగుతున్న అరాచకాలపై నోరు మెదపని ప్రభుత్వం.. ప్రతిపక్షాలు డీఎస్సీ స్కామ్ను లేవనెత్తినప్పుడు మాత్రం హైపర్యాక్టివ్గా మారుతోందని ధ్వజమెత్తారు.