అమరావతి: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక తీర్పును వెల్లడించింది. అమరావతిని రాజధానిగా అభివృద్ధి చేయాలని, రాజధానిపై ఎలాంటి చట్టాలు చేసే అధికారం అసెంబ్లీకి లేదని స్పష్టం చేసింది. సీఆర్డీఏ చట్టప్రకారం వ్యవహరించాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. అమరావతి నుంచి ఏ కార్యాలయాన్నీ తరలించకూడదని తెలియజేసింది. శాసనసభకు లేని అధికారాలతో చట్టాన్ని రద్దు చేయలేరని, శాసన అధికారం లేనప్పుడు సీఆర్డీఏ చట్టం రద్దు కుదరదని పేర్కొంది. పిటిషనర్లందరికీ ఖర్చుల కింద రూ.50వేల చొప్పున చెల్లించాలని హైకోర్టు తీర్పును వెల్లడించింది.
రాజధాని రైతులకు న్యాయం చేసే విధంగా నిర్ణయాలను ఇచ్చింది. భూములు ఇచ్చిన రైతులకు మూడు నెలల్లో అన్ని సౌకర్యాలతో అభివృద్ధి పరిచిన ప్లాట్లను అప్పగించాలని ఆదేశించింది. ఈ అభివృద్ధి పనులపై ఎప్పటికప్పుడు కోర్టుకు నివేదిక ఇవ్వాలని సూచించింది. రాజధాని అవసరాలకు తప్ప ఇతర అవసరాలకు భూమి తనఖా పెట్టడానికి వీల్లేదని స్పష్టం చేసింది.
ఒప్పందం ప్రకారం ఆరు నెలల్లో మాస్టర్ప్లాన్ ప్రకారం ఉన్నది ఉన్నట్లుగా అభివృద్ధి పనులన్ని పూర్తి చేయాలని తీర్పును వెలువరించింది. హైకోర్టు మూడు రాజధానులు, పాటు సీఆర్డీఏ చట్టం పై ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం ఈరోజు తుది తీర్పును వెల్లడించింది.