Prabhas-Maruthi Movie | ప్రభాస్ ప్రస్తుతం వరుస పాన్ ఇండియా చిత్రాలను చేస్తున్నాడు. లేటెస్ట్గా ఈయన నటించిన చిత్రం ‘రాధేశ్యామ్’ . పీరియాడికల్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ చిత్రానికి రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహించాడు. మార్చి 11న విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను తీవ్రంగా నిరాశపరిచింది.ఇక ప్రభాస్ ప్రస్తుతం నాలుగు సినిమాలను లైన్లో పెట్టాడు. అందులో మారుతి ప్రాజెక్ట్ కూడా ఒకటి. ఈ కాంబోపై అఫిషియల్గా ప్రకటన రాకపోయినా, ఇటీవలే ప్రభాస్ పెద్దమ్మ నిర్మలా దేవి ఓ ఇంటర్వూలో కన్ఫార్మ్ చేశారు. హర్రర్ కామెడీ నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కనుందని సమాచారం. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన మరో వార్త సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
ఈ చిత్రంలో ముగ్గురు హీరోయిన్లకు స్థానం ఉందట. మాళవిక మోహన్, శ్రీలీలా ఈ చిత్రంలో ఇద్దరు హీరోయిన్లుగా నటిస్తున్నట్లు గతం నుంచి వార్తలు వస్తున్నాయి. తాజాగా ఈ చిత్రంలో మెయిన్ హీరోయిన్గా అనుష్కను ఎంపిక చేశారని సమాచారం. వీళ్ళిద్దరు గతంలో మిర్చి, బాహుబలి రెండు పార్ట్స్లలో కలిసి నటించారు. ఇప్పటికే మేకర్స్ అనుష్కతో సంప్రదింపులు జరిపారట, అనుష్క కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది. దీనిపై అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఈ చిత్రం ప్రీ ప్రోడక్షన్ పనులలో బిజీగా ఉంది. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన ఒక పెద్ద బంగ్లా సెట్ తుది దశకు వచ్చినట్లు సమాచారం. ఈ బంగ్లా కోసం మేకర్స్ దాదాపు 5కోట్లను ఖర్చుపెట్టినట్లు టాక్. దానయ్య డివివి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ప్రభాస్ ఈ చిత్రానికి 100రోజుల వరకు కాల్షీట్లు ఇచ్చాడట. వీలైనంత త్వరగా షూటింగ్ను పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు తీసకురావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట.
ఇక ప్రభాస్ హీరోగా ఓంరౌత్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఆదిపురుష్’ ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులలో బిజీగా ఉన్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కానున్నట్లు మేకర్స్ ఇది వరకే ప్రకటించారు. దీంతో పాటుగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘సలార్’, నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ప్రాజెక్ట్-K’ చిత్రాలు ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్నాయి. వీటితో పాటుగా సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించే ‘స్పిరిట్’ ప్రస్తుతం స్క్రిప్ట్ దశలో ఉంది.