హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 11 (నమస్తే తెలంగాణ)/ఘట్కేసర్ రూరల్: అందరికీ నాణ్యమైన విద్యను అందించడమే లక్ష్యంగా అనురాగ్ యూనివర్సిటీ ముందుకు సాగుతున్నదని, నిబంధనల ప్రకారమే వర్సిటీలో ప్రవేశాల ప్రక్రియ కొనసాగిస్తున్నట్టు సీఈవో నీలిమ సూర్యదేవర తెలిపారు. 2022-23 విద్యాసంవత్సరానికి ఇంజినీరింగ్, అగ్రికల్చర్ కోర్సుల్లో అడ్మిషన్ల ప్రక్రియ బ్రోచర్ను శుక్రవారం విడుదల చేశారు. మార్చి 4, 5, 6 తేదీల్లో ప్రవేశ పరీక్షలు నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు. ఈ సందర్భంగా సీఈవో మాట్లాడుతూ.. ప్రవేశ పరీక్షలో మంచి ర్యాంకులు సాధించినవారికి స్కాలర్షిప్లు, మొదటి టాప్ 10 ర్యాంకర్లకు అడ్మిషన్, ట్యూషన్ ఫీజు లేకుండా ఉచిత విద్య అందిస్తామని ప్రకటించారు. 11 నుంచి 25 లోపు ర్యాంకర్లకు ట్యూషన్ ఫీజులో 50%, 26 నుంచి 100 లోపు ర్యాంకర్లకు ట్యూషన్ ఫీజులో 25% రాయితీ ఇస్తామని చెప్పారు. టాప్ 500 ర్యాంకులు సాధించిన విద్యార్థులకు అందరికీ ల్యాప్టాప్లు అందజేస్తామని తెలిపారు.
వీసీ ప్రొఫెసర్ రామచంద్రం మాట్లాడుతూ.. అనురాగ్ సెట్ను ఆన్లైన్, ఆఫ్లైన్ రెండు పద్ధతుల్లో నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఈ ప్రవేశ పరీక్షకు దరఖాస్తులకు ఫీజు లేదని స్పష్టంచేశారు. దరఖాస్తుకు మార్చి 3వ తేదీ వరకు గడువు విధించామని, మార్చి 26న ఫలితాలు విడుదల చేస్తామని చెప్పారు. ప్రస్తుతం వర్సిటీలో 2,700 సీట్లు ఉండగా, అనురాగ్ సెట్ ద్వారా 1,500, ఎంసెట్ ద్వారా 1,200 సీట్లు భర్తీ చేస్తామని తెలిపారు. అగ్రికల్చర్ కోర్సులో 240 సీట్లు ఉన్నాయని తెలిపారు. కార్యక్రమంలో వర్సిటీ చాన్స్లర్ డాక్టర్ యూబీ దేశాయ్ తదితరులు పాల్గొన్నారు.