జీవితంలో ఎదురైన ఒడిదొడుకులే ఎలా బతకాలో పాఠాలు నేర్పించాయంటున్నది మలయాళ భామ అనుపమ పరమేశ్వరన్. చిన్న వయసులో నాయికగా మారిన అనుపమ..ఆ తర్వాత కెరీర్లో జయాపజయాలను త్వరత్వరగా చూసేసింది. ఇవన్నీ తనను మానసికంగా బలంగా మార్చేశాయని చెబుతున్నదామె. గత రెండేళ్లు తెలుగులో ఒక్క సినిమా లేని ఆమె ఈ ఏడాది నాలుగు చిత్రాలు చేస్తున్నది. వీటిలో ‘రౌడీ బాయ్స్’ విడుదలవగా..మరో మూడు చిత్రాలు చిత్రీకరణ దశలో ఉన్నాయి. ఇటీవల అనుపమ స్పందిస్తూ…‘నటిగా నా ప్రయాణం అనేక అనుభవాలను నేర్పింది. ఎదురైన ఒడిదొడుకులు పరిణితి తీసుకొచ్చాయి. ఖాళీగా ఉన్నా గానీ నచ్చని సినిమాలు ఒప్పుకోలేదు. ఇక ఈ కెరీర్ వద్దేమో అనిపించిన రోజులూ ఉన్నాయి. ఇప్పుడేం చేయాలా అనిపించేది. కానీ వరుస అవకాశాలు రావడం నా ఆలోచనను మార్చేస్తున్నది’ అని చెప్పింది. ప్రస్తుతం నిఖిల్ సరసన ‘కార్తికేయ 2’, ‘18 పేజెస్’ చిత్రాల్లో నటిస్తున్న అనుపమ..‘బటర్ ఫ్లై’ అనే మరో సినిమాలో కనిపించనుంది.