టెహ్రాన్: ఇరాన్లో హిజాబ్ వ్యతిరేక ఆందోళనకారులపై దమణకాండ కొనసాగుతూనే ఉన్నది. ఓ వైపు ప్రభుత్వం ఆంక్షలు, సైన్యం అణచివేత సాగుతుండగానే మరోవైపు నిరసనకారులపై దుండగులు కాల్పులకు తెగబడుతున్నారు. ఖుజెస్థాన్ ప్రావిన్స్లోని లేజ్ నగరంలో కొందరు హిజాబ్కు వ్యతిరేకంగా ఆందోళన నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో సెంట్రల్ మార్కెట్ ప్రాంతానికి చేరుకోగానే రెండు మోటారు సైకిళ్లపై వచ్చిన గుర్తు తెలియని వ్యక్తులు వారిపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. దీంతో ఐదుగురు అక్కడికక్కడే మృతిచెందారు. మరో పది మందికిపైగా గాయపడ్డారని మీడియా వర్గాలు వెల్లడించారు. ఇప్పటివరకు ఈ కాల్పులకు ఏ సంస్థా, వ్యక్తులు బాధ్యత వహించలేదన్నారు. కాగా, గత నెల 26న షిరాజ్లో నిరసనకారులపై ఐఎస్ ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. దీంతో 13 మంది దుర్మరణం చెందారు.
సెప్టెంబర్ 16న హిజాబ్ సరిగ్గా ధరించలేదని మాసా అమీని అనే 22 ఏళ్ల యువతిని టెహ్రాన్లో పోలీసులు అరెస్టు చేశారు. కస్టడీలో ఉండగా ఆమె మృతి చెందడం ఇరాన్లో తీవ్ర దుమారం రేపింది. అప్పటినుంచి హిజాబ్కు, పోలీసులకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ప్రజలు నిరసనలు తెలుపుతున్నారు. అందులో భాగంగా మహిళలు తమ జట్టును కత్తిరించుకుంటున్నారు. అమిని మృతికి కారణమైన హిజాబ్ను వ్యతిరేకిస్తూ కాల్చేస్తున్నారు. అమీనిని అరెస్టు చేసి హింసించిన మొరాలిటీ పోలీసులకు శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ఆందోళనల్లో ఇప్పటివరకు వందలాది మంది నిరసనకారులు చనిపోయారు.