దుగ్గొండి, అక్టోబర్ 26: వరంగల్ జిల్లా దుగ్గొండి మండలంలోని చాపలబండ గ్రామంలో ‘ఆంత్రాక్స్’ కలకలం రేపుతున్నది. రెండు రోజుల వ్యవధిలోనే చాపలబండ వాసి గజ్జెల సాంబయ్యకు చెందిన నాలుగు గొర్రెలు మృత్యువాతపడ్డాయి. దీంతో ఆయన పశువైద్యాధికారులకు సమాచారమందించారు. వెంటనే వారు గ్రామానికి చేరుకొని పరీక్షించి గొర్రెలకు ఆంత్రాక్స్ వ్యాధి సోకినట్టు ప్రాథమికంగా నిర్ధారించారు. వ్యాధి సోకకుండా 1,200 గొర్రెలకు టీకాలు వేశారు. ఇటీవల అంగడిలో అనంతపురం నుంచి వచ్చిన వారి నుంచి ఈ గొర్రెలను కొనుగోలు చేసినట్టు గజ్జెల సాంబయ్య తెలిపారు.
చాపలబండ గ్రామంలోని గొర్రెలకు ఆంత్రాక్స్ సోకినట్టు ప్రాథమికంగా నిర్ధారణ కావడంతో పశుసంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ బాలకృష్ణ స్థానిక పశువైద్యాధికారులు, సర్పంచ్ ఏడెల్లి రజితాఉమేశ్రెడ్డిలతో కలిసి గొర్రెలను పరిశీలించారు. ఈ సందర్భంగా జేడీ మాట్లాడుతూ.. మిగతా గొర్రెలకు వ్యాధి సోకకుండా టీకాలు వేస్తున్నట్టు తెలిపారు. లక్షణాలు ఉన్న గొర్రెలను ఊరి బయటే ఉంచాలని సూచించారు. గొర్రెల యజమానులు, కాపరులు అప్రమత్తంగా ఉండాలన్నారు.
నవరంధ్రాల నుంచి రక్తం కారడం. జ్వరంగా ఉండటం. మేత మేయకపోవడం. నీళ్లు తాగకపోవడం. విడిగా ఉండటం వంటి లక్షణాలు ఉంటే వెంటనే సదరు గొర్రెలను విడిగా ఉంచాలి. ముందే గుర్తించి వ్యాక్సిన్ ఇప్పిస్తే ప్రమాదం నుంచి బయటపడవచ్చని పశువైద్యాధికారులు తెలిపారు.