హైదరాబాద్, నవంబర్ 25 (నమస్తే తెలంగాణ): బహుళ-పారిశ్రామిక ఉపయోగాల కోసం ఫ్లో కెమిస్ట్రీ ఇన్నోవేషన్ అండ్ టెక్నాలజీ హబ్ను హైదరాబాద్లో ఏర్పాటు చేయనున్నారు. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్గా పనిచేయనున్న ఈ హబ్ భారతదేశంలో ఔషధ రంగాన్ని మరింత ఉన్నత శిఖరాలకు చేర్చగలదని రాష్ట్ర పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు ఆశాభావం వ్యక్తంచేశారు. ఆధునిక విధానాల ద్వారా పరిశోధన, అభివృద్ధి నుంచి తయారీవరకు, అలాగే, పచ్చదనం, సుస్థిర ప్రక్రియలకు నమూనాగా మారడానికి ఇది దోహదపడుతుందని ఆయన చెప్పారు.
ఔషధ పరిశోధన, అభివృద్ధితోపాటు, ఔషధాల తయారీలో వాడే పదార్థాల (యాక్టివ్ ఫార్మా ఇంగ్రీడియెంట్స్-ఏపీఐ) ఉత్పత్తిలో ఫ్లో కెమిస్ట్రీ టెక్నిక్స్ను ఉపయోగించేందుకు ఈ హబ్ దోహదపడుతుందని చెప్పారు. ప్రగతిభవన్లో గురువారం మంత్రి కేటీఆర్, ఐటీశాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్ రంజన్ సమక్షంలో రెడ్డీస్ ల్యాబొరేటరీస్ ఎండీ జీవీ ప్రసాద్, లారస్ ల్యాబ్స్ సీఈఓ డాక్టర్ సత్యనారాయణ చావా, హైదరాబాద్ ఫార్మాసిటీ సీఈఓ, ప్రభుత్వ లైఫ్ సైన్సెస్, ఫార్మా విభాగం డైరెక్టర్ శక్తి నాగప్పన్, డాక్టర్ రెడ్డీస్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ లైఫ్ సైన్సెస్ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాస్ ఓరుగంటి తదితరులు ఫ్లో కెమిస్ట్రీ ఇన్నోవేషన్ అండ్ టెక్నాలజీ హబ్ ఏర్పాటుకు సంబంధించిన కన్సార్షియం ఒప్పందంపై సంతకాలు చేశారు.
ఈ హబ్ను డాక్టర్ రెడ్డీస్ ఇనిస్టిట్యూ ట్ ఆఫ్ లైఫ్ సైన్సెస్ (డీఆర్ఐఎల్ఎస్)లో ఏర్పాటు చేయనుండగా, రెడ్డీస్ ల్యాబొరేటరీస్తోపాటు లారస్ ల్యాబ్స్ నిధులు సమకూర్చనున్నా యి. ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రజ్ఞులు, అంతర్జాతీయ సలహాదారు ప్రొఫెసర్ గోవర్ధన్ మెహతా (యూనివర్శిటీ ఆఫ్ హైదరాబాద్), కేంబ్రిడ్జ్ యూనివర్శిటీ ప్రొఫెసర్ స్టీవెన్ లే, ఆస్ట్రియాలోని గ్రాజ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఆలివర్ కప్పే, టోక్యో యూనివర్శిటీ ప్రొఫెసర్ షు కొబయాషీ తదితరులు శాస్త్రీయ మార్గదర్శకత్వం అందించనున్నారు. తెలంగాణ ప్రభుత్వం వ్యూహాత్మక సహకారం అందించనున్నది.
ఔషధ రంగం అభివృద్ధికి దోహదం
ఈ కేంద్రం ఔషధరంగం అభివృద్ధికి దోహదపడుతుందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ఈ కేంద్రం ఏర్పాటుపట్ల హర్షం వ్యక్తంచేస్తూ, డా. రెడ్డీస్ ల్యాబొరేటరీస్, లారస్ ల్యాబ్స్ను ఆయన అభినందించారు. లైఫ్ సైన్సెస్ రంగం అభివృద్ధితోపాటు ఈ రంగంలో తమ నాయకత్వ స్థానాన్ని నిలుపుకొనేందుకు కట్టుబడి ఉన్నట్లు జయేశ్రంజన్ తెలిపారు. రాష్ట్రంలో లైఫ్ సైన్సెస్ రంగం అభివృద్ధిలో ఈ సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్ ఒక మైలురాయిగా నిలుస్తుందని శక్తి నాగప్పన్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ సారథ్యంలో ఫ్లో కెమిస్ట్రీతోపాటు ఏపీఐ, ఇంటర్మీడియట్ పరిశ్రమలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని తెచ్చేందుకు చేస్తున్న ఈ కృషిలో తాము భాగస్వాములవడం సంతోషంగా ఉన్నదని జీవీ ప్రసాద్ అన్నారు. డాక్టర్ చావా మాట్లాడుతూ, హైదరాబాద్లో ఈ హబ్ను ఏర్పాటు చేయడంవల్ల ఔషధ రంగంలో నగరానికి ఉన్న గ్లోబల్ లీడర్ స్థానం సుస్థిరం అవుతుందని చెప్పారు.