హైదరాబాద్, మార్చి 4(నమస్తే తెలంగాణ): ఉక్రెయిన్ నుంచి శుక్రవారం నాడు 111మంది తెలంగాణ విద్యార్థులు శుక్రవారం ఢిల్లీ, ముంబైకి వచ్చారు. ముంబై విమానాశ్రయంలో తెలంగాణ ప్రభుత్వం ఐఏఎస్ అధికారి శరత్ను ప్రత్యేకంగా నియమించింది. అక్కడికి వచ్చిన తెలంగాణ విద్యార్ధులను శరత్ రిసీవ్ చేసుకొన్నారు. అలాగే ఢిల్లీకి వచ్చిన విద్యార్థులను ఢిల్లీ రెసిడెంట్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్ రిసీవ్ చేసుకున్నారు. ఈ విద్యార్థులకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేసి, ప్రభుత్వ ఖర్చుతో విమానాల్లో హైదరాబాద్కు పంపించారు. శంషాబాద్ విమానాశ్రయంలో ఈ విద్యార్ధులను రిసీవ్ చేసుకొన్న అధికారులు స్వస్థలాలకు పంపిస్తున్నారు.
ఉక్రెయిన్ దేశంలో చిక్కుకొన్న విద్యార్థులకు రాష్ట్రప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. కల్లోల దేశంలో చిక్కుకొన్న జల్పల్లి మున్సిపాలిటీ పరిధిలోని షాహీన్నగర్కు చెందిన మహ్మద్ మసియోద్దీన్ కుమారుడు జావిద్, కుమార్తె సుమయ్యాతో మంత్రి వీడియో కాల్లో మాట్లాడారు. ప్రభుత్వం తరుపున అండగా ఉంటామని, ధైర్యంగా ఉండాలన్నారు. ప్రభుత్వ ఖర్చులతో విద్యార్థులను స్వదేశానికి తీసుకొచ్చేందుకు కృషిచేస్తున్నట్టు పేర్కొన్నారు.