గురుగ్రామ్ కేంద్రంగా పనిచేసే విన్గ్రీన్ ఫార్మ్స్ వ్యవస్థాపకురాలు అంజు శ్రీవాస్తవ. ఈ సంస్థ చిప్స్, సాస్, బిస్కెట్స్ తదితర చిరుతిండ్లను ఆరోగ్యకరమైన దినుసులతో తయారుచేస్తుంది. విన్గ్రీన్స్కు సొంతంగా వ్యవసాయ క్షేత్రాలంటూ లేవు. దాదాపు 15 ఎకరాల భూమిని కౌలుకు తీసుకుని తులసి, పుదీనా లాంటి ఔషధ గుణాలున్న పంటలు సాగు చేస్తున్నారు.
‘భూమి రైతుల దగ్గరే ఉండాలి. అప్పుడే దానికి విలువ, రైతుకు గుర్తింపు’ అంటారు అంజు. తన వ్యాపార ప్రస్థానంలో భాగంగా ఆమె.. ఏ నేలలో ఎలాంటి పంటలు పండించాలో రైతులకు బోధించారు. ఆహార పదార్థాల నాణ్యత అంతంత మాత్రంగా ఉంటున్న పరిస్థితుల్లో ఆరోగ్యాన్నిచ్చే చిరుతిండ్లను తాజాగా అందించడం గొప్ప విషయమే. దీనివల్ల పిల్లలకు పోషకాలు లభిస్తాయి. బాల్యాన్ని మింగేస్తున్న ఊబకాయాన్నీ నియంత్రించవచ్చు. ‘నేను సామాజిక బాధ్యత కలిగిన క్యాపిటలిస్ట్ని. కాబట్టే సాధారణ రైతుల గురించి, మహిళా రైతు కూలీల గురించీ ఆలోచిస్తాను. వాళ్లు సంతోషంగా ఉన్నరోజే.. నేను ఆంత్రప్రెన్యూర్గా విజయం సాధించినట్టు’ అని చెబుతారామె.