బన్సీలాల్పేటలో అంత్యక్రియలు
కవాడిగూడ/కార్వాన్, డిసెంబర్ 27: టీటీడీ బోర్డు మాజీ సభ్యుడు, రజక అభివృద్ధి సంస్థ జాతీయ వ్యవస్థాపకులు డాక్టర్ ఎం.అంజయ్య(78) గుండెపోటుతో మరణించారు. వారం రోజులుగా తీవ్ర అస్వస్థతకు గురైన ఆయన బంజారాహిల్స్ కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. డాక్టర్ ఎం.అంజయ్య ప్రకాశం జిల్లా, ఒంగోలు తాలుకాలోని దశరాజులపల్లె రాములమ్మ, వీరస్వామిల సంతానం. ఆయనకు భార్య సుజాత, ఒక కుమారుడు జవహర్ గాంధీ, ఇద్దరు కూతుళ్లు.. పద్మ, లలిత ఉన్నారు. రజకాభివృద్ధి సంస్థను ఏర్పాటు చేసి, ఉమ్మడి ఏపీలో అనేక కార్యక్రమాలను చేపట్టారు. రజకులను ఎస్సీ జాబితాలో చేర్చాలని డిమాండ్ చేస్తూ దేశ వ్యాప్తంగా ఉద్యమం చేపట్టారు. లోయర్ ట్యాంక్బండ్ రజక కాలనీలో ఇండ్ల నిర్మాణం, ధోబీఘాట్ల అభివృద్ధికి ఎంతో కృషి చేశారు.
బతికుండగానే సమాధి నిర్మాణం..
దివంగత వైఎస్ఆర్ హయాంలో టీటీడీ బోర్డు సభ్యుడిగా పనిచేశారు. ఆలిండియా సాయి సేవా సమాజ్ అధ్యక్షుడిగా కొనసాగుతూ లోయర్ ట్యాంక్బండ్ ద్వారకానగర్లో శ్రీ షిర్డీ సాయిబాబా ఆలయాన్ని నిర్మించారు. ఈ ఆలయంలోనే తాను చనిపోయిన తర్వాత ఖననం చేసే విధంగా సమాధిని కూడా ముందుగానే నిర్మించుకున్నారు. అయితే పరిస్థితుల నేపథ్యంలో కుటుంబ సభ్యులు బన్సీలాల్పేట హిందూ శ్మశానవాటికలో దహన సంస్కారాలు నిర్వహించారు.
అంజయ్య మృతికి నివాళి..
అంజయ్య మృతితో పలు రజక సంఘాలు, పలు బీసీ సంఘాల నేతలు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. అంజ య్య పార్థివ దేహాన్ని ఎమ్మెల్యే ముఠా గోపాల్, చేవెళ్ల ఎమ్మెల్యే యాదయ్య, ఏపీ రజక సంఘం ఐక్య వేదిక అధ్యక్షుడు అంజయ్య, తెలంగాణ ప్రదేశ్ గంగపుత్ర సంఘం అధ్యక్షుడు ఎఎల్.మల్లయ్య, కవాడిగూడ కార్పొరేటర్ జి.రచనశ్రీ, శంషాబాద్ కార్పొరేటర్ కుమార్, తెలంగాణ రజకాభివృద్ధి చైర్మన్ బొమ్మరాజు కృష్ణ, వైస్ చైర్మన్ ఎం.నర్సింహ, ప్రధాన కార్యదర్శి జూపల్లి రాజశేఖర్, రాష్ట్ర నాయకులు కొండమీది హరినాథ్, చంద్రమోహన్, కార్వా న్ రజక సంఘం నాయకులు బాబురావు, అశోక్, జ్ఞానీ పహిల్వాన్, ప్రేం, గోపాల్, శంకర్, నర్సింగ్, తెలంగాణ ముదిరాజ్ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు సదానంద్ ముదిరాజ్ నివాళులర్పించారు.