మునగాల, డిసెంబర్ 12 : సూర్యాపేట జిల్లా మునగాలలోని రామలింగేశ్వర ఆలయ ఆవరణలో గుంతలు తీస్తుండగా పురాతన విగ్రహాలు వెలుగుచూశాయి. ఆలయ ప్రాంగణంలో కొత్త గదుల నిర్మాణం చేపట్టారు. ఆదివారం జేసీబీతో పిల్లర్ గుంతలు తీస్తుండగా ఒక గుంతలో 17 విగ్రహాలు బయటడ్డాయి. అందులో వైకుంఠ లక్ష్మీనారాయణ, లక్ష్మీనారాయణ, వేణుగోపాల, రుక్మిణి, సత్యభామ, సీతారామ, లక్ష్మణ, రామానుజాచార్య, తిరుమంగై ఆళ్వారులు, నమల్ ఆళ్వారులు, మరికొన్ని ఆళ్వార్ల విగ్రహాలు ఉన్నట్టు ప్రముఖ పురావస్తు పరిశోధకుడు ఈమని శివనాగిరెడ్డి తెలిపారు. ప్రతిమ లక్షణం, శిల్పకళా శైలిని అనుసరించి ఈ విగ్రహాలు క్రీస్తు శకం 17వ శతాబ్ది ఉత్తరార్ధానికి చెందినవిగా తెలిపారు.