న్యూఢిల్లీ : పార్టీలో గ్రూపిజం పెరుగుతోందని ఆరోపణలు గుప్పిస్తూ కాంగ్రెస్ పార్టీని వీడిన పీసీ చాకో ఆరోపణలను ఆ పార్టీ సీనియర్ నేత ఆనంద్ శర్మ తోసిపుచ్చారు. బీజేపీని ఓడించేందుకు సోనియా గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ ఐక్యంగా పోరాడుతుందని ఆయన స్పష్టం చేశారు. సంస్ధాగత మార్పులు కోరుతూ పార్టీ హైకమాండ్కు లేఖ రాసిన జీ 23 నేతల్లో ఒకరైన ఆనంద్ శర్మ రానున్న ఎన్నికల్లో కాషాయ పార్టీ ఓటమికి పార్టీ సమైక్యంగా పోరాడుతుందని వ్యాఖ్యానించడం గమనార్హం.
సోనియా గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ ముందున్న లక్ష్యం బీజేపీ సహా ఇతర ప్రత్యర్ధులను ఓడించడమేనని మీడియాతో మాట్లాడుతూ శర్మ వ్యాఖ్యానించారు. పార్టీలో వర్గాలపై తప్పుడు అభిప్రాయం ఉండరాదని, సంస్ధాగత చర్చలకు కాంగ్రెస్ పార్టీ ఎన్నటికీ సిద్ధమని పేర్కొన్నారు. స్వాతంత్య్ర సమరం నాటి నుంచి దిగ్గజ నేతల మధ్య భిన్నాభిప్రాయాలున్నా చర్చలతో సమైక్యంగా లక్ష్యం దిశగా సాగిన సంప్రదాయం కాంగ్రెస్ పార్టీలో ఉందని గుర్తుచేశారు. ఇక పార్టీలో గ్రూపిజం పెరిగిపోతున్నా కాంగ్రెస్ అగ్రనాయకత్వం ప్రేక్షకపాత్ర పోషిస్తోందని ఆరోపిస్తూ సీనియర్ నేత పీసీ చాకో బుధవారం పార్టీని వీడుతున్నట్టు ప్రకటించారు.