టోక్యో: జపాన్ రాజరిక ప్రజాస్వామ్యం కింద ఉంది. చక్రవర్తి నామమాత్రపు దేశాధినేతగా ఉంటారు. పార్లమెంటు విశ్వాసం పొందిన ప్రధాని దేశాన్ని పాలిస్తారు. ఇప్పటిదాకా చక్రవర్తి స్థానాన్ని పురుషులే ఆక్రమించారు. ఆడవారి పేరు కనీసం పరిశీలనలోకి తీసుకోలేదు. ఇది ఉత్త సాంప్రదాయం మాత్రమే కాదు. 1947 రాజవంశ కుటుంబ చట్టం కింది మహిళలు ఎవరూ సింహాసనాన్ని అధిష్టించడానికి వీల్లేదు. కానీ ఇప్పుడు జపాన్ చక్రవర్తినిగా ఓ మహిళ క్రైజాంతిమమ్ (చేమంతి) సింహాసనం అధిష్టించే అవకాశాలపై బలమైన చర్చ జరుగుతున్నది. చక్రవర్తి అకిహితో రెండేండ్ల క్రితం అనారోగ్య కారణాల వల్ల సింహాసన త్యాగం చేయడంతో నరుహితో గద్దెనెక్కారు. నరుహితోకు యువరాణి అయికో ఒక్కతే కుమార్తె. ఆమె సామాన్య పౌరుని పెండ్లాడితే రాజకుటుంబం నుంచి బయటకు వెళ్లిపోవాల్సి వస్తుంది. చట్టం మార్చకుండా ఆమెగానీ, ఆమె కుమారుడు గానీ సింహాసనార్హత పొందలేరు. ఇక మిగిలింది ఇద్దరు వారసులు ఉత్తరాధికారిగా నియమితుడైన యువరాజు ఫుమిహితో (55), ఆయన కుమారుడు యువరాజు హిసహితో (14). నరుహితో 85 ఏళ్ల బాబాయి యువరాజు హితాచీ చక్రవర్తి అయ్యేందుకు గల అవకాశాలు దాదాపు మృగ్యమే. ఫుమిహితో పెద్దకూతురు యువరాణి మాకో గురించి ఇటీవల సింహాసన వారసురాలిగా కొంత చర్చ నడుస్తున్నది. ప్రస్తుత జపాన్ ప్రధాని యోషిహిడే సుగా మగవారే గద్దెనెక్కాలని కోరుకునే ఛాందసవాదు లను ఏదైనా చేస్తాడనేది సందేహమే. ఆయనకు ముందర ప్రధానిగా ఉన్న షింజో ఆబే ఈ విషయమై ఏదైనా మార్పు తెచ్చే అవకాశాన్ని జారవిడుచుకున్నారని విమర్శలున్నాయి. ఇవన్నీ అలా ఉంచితే జపాన్ ప్రజల్లో 87 శాతం ఓ మహిళ సింహాసనంపై కూర్చోవడాన్ని సమర్థిస్తున్నట్టు చెప్పారు. కానీ 80 శాతం మంది యువరాణుల సంతానంలోని పురుషులకు అవకాశం ఇవ్వాలని భావిస్తున్నారు. ఇందులో దేనికైనా చట్ట సవరణ తప్పదు.