Champions of Change Award: ప్రముఖ వ్యాపారవేత్త, AMR ఇండియా లిమిటెడ్ గ్రూప్ అధిపతి ఎ. మహేశ్ రెడ్డికి ‘ఛాంపియన్స్ ఆఫ్ ఛేంజ్ 2024’ అవార్డు దక్కింది. సామాజిక రంగంలో ఆయన చేస్తున్న సేవలకు గాను ఆయన ఈ అవార్డును దక్కించుకున్నారు. మంగళవారం రాత్రి ముంబైలోని గ్రాండ్ హయాత్ హోటల్లో ముగిసిన కార్యక్రమంలో సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి కె.జి. బాలకృష్ణన్ చేతుల మీదుగా మహేశ్ రెడ్డి ఈ అవార్డును అందుకున్నారు.
మైనింగ్, ఇరిగేషన్ రంగాలలో వ్యాపారాలు నిర్వహిస్తున్న ఎఎంఆర్ గ్రూప్లో ప్రస్తుతం ఐదు వేల మంది ఉద్యోగులు ప్రత్యక్షంగా ఉపాధి పొందుతున్నారు. రాబోయే కొన్నేండ్లలో ఈ సంస్థ సుమారు లక్ష మంది యువకులకు ఉపాధి కల్పించే దిశగా అడుగులు వేస్తోంది. మైనింగ్ బిజినెస్లో ఎఎంఆర్ ప్రథమ స్థానంలో ఉంది. వ్యాపారరంగంతో పాటు ఆధ్యాత్మికంగానూ మహేశ్ రెడ్డి సేవాగుణాన్ని చాటుకుంటున్నారు. సాయిబాబా భక్తుడైన ఎఎంఆర్ గ్రూప్ అధినేత.. మహారాష్ట్రలో ఉన్న షిరిడీ సాయి ఆలయానికి బంగారు కిరీటాన్ని విరాళంగా అందజేశారు.
అంతేగాక ఆంధ్రప్రదేశ్లోని శ్రీశైలం, కాణిపాకం, రాజరాజేశ్వర ఆలయం (నెల్లూరు), పృధ్వీశ్వర ఆలయాలలో పునర్నిర్మాణ పనులను తన సొంత ఖర్చుతో చేయించారు. ఆధ్యాత్మిక రంగంలో ఆయన చేస్తున్న సేవలతో పాటు సాయి ప్రేరణ ట్రస్ట్తో సాయినాథుడి బోధనలను విస్తరిస్తున్నందుకు గాను గతంలో ఆయనకు ‘మాలిక్ ఏక్ సుర్ అనేక్’ అవార్డు కూడా దక్కింది. కరోనా సమయంలో మహేశ్ రెడ్డి.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలకు తలా కోటి రూపాయల విరాళం కూడా అందజేశారు. ఇటీవలే అయోధ్యలో శ్రీరామచంద్రుడి ఆలయానికి కూడా ఆయన కోటి రూపాయలను విరాళంగా ఇచ్చారు. సాయి బోధనలపై ఆయన రెండు తెలుగు సినిమాలను కూడా నిర్మించారు.