హైదరాబాద్, అక్టోబర్ 25 (నమస్తే తెలంగాణ): రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం నాగారం భూదాన్ భూముల బదిలీ వ్యవహారంలో అక్రమాలకు సంబంధించి అధికారులు అమోయ్కుమార్ను ప్రశ్నించారు. ఉదయం 6 గంటలకే ఆయన ఈడీ కార్యాలయానికి చేరుకోగా.. 9 గంటల నుంచి సాయంత్రం ఐదున్నర గంటల వరకు ఈడీ ప్రశ్నించింది. 42 ఎకరాల భూమి బదిలీ చేసినట్టు ఆయనపై ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో.. ఈడీ అధికారులు ఆయనను రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్కు తీసుకెళ్లి తిరిగి తీసుకొచ్చారు. కాగా.. మధురానగర్ కాలనీ సంక్షేమ సంఘం సభ్యులు శుక్రవారం హైదరాబాద్లోని ఈడీ అధికారులకు అమోయ్కుమార్పై ఫిర్యాదు చేశారు. మధురానగర్లోని 104 ఎకరాలు భూమి ప్లాట్లు వేయగా, తాము కొనుగోలు చేశామని, రంగారెడ్డి జిల్లా కలెక్టర్గా ఉన్న సమయంలో ఆయన రికార్డులను తారుమారు చేసి ఇతరులకు అప్పనంగా కట్టబెట్టారని ఆరోపించారు.