లక్నో: ఉత్తరప్రదేశ్ ఆగ్రాలోని ప్రసిద్ధ తాజ్మహల్లో మూసి ఉన్న 22 గదులను తెరువాలంటూ దాఖలైన పిల్ను అలహాబాద్ హైకోర్టు గురువారం తిరస్కరించింది. లక్నో బెంచ్ న్యాయమూర్తులు డీకే ఉపాధ్యాయ, సుభాష్ విద్యార్థి, పిటిషన్దారుడిపై మండిపడ్డారు. ‘రేపు మీరు వచ్చి గౌరవనీయులైన న్యాయమూర్తుల ఛాంబర్లకు వెళ్లమని మమ్మల్ని అడుగుతారా? దయచేసి పిల్ వ్యవస్థను అపహాస్యం చేయకండి’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాగా, తాజ్ మహల్లో హిందూ విగ్రహాల ఉనికిని తనిఖీ చేసేందుకు మూసి ఉన్న 22 గదులను తెరిచేలా భారత పురావస్తు శాఖ (ఏఎస్ఐ)ని ఆదేశించాలని కోరుతూ అలహాబాద్ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఉత్తరప్రదేశ్లోని అయోధ్య జిల్లా బీజేపీ మీడియా ఇన్చార్జి రజనీష్ సింగ్ మే 4న ఈ పిల్ను దాఖలు చేశారు. తాజ్మహల్ గతంలో శివాలయం అని అందులో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో నిజ నిర్ధారణ కోసం ఒక కమిటీని ఏర్పాటు చేయాలని, తాజ్మహల్లో మూసి ఉన్న గదుల అంశంపై భారత పురావస్తు శాఖ నుంచి నివేదిక కోరాలని కోర్టుకు విజ్ఞప్తి చేశారు.
మరోవైపు గురువారం ఈ పిల్ను పరిశీలించిన న్యాయమూర్తులు, ఈ విషయాలపై పిచ్చాపాటిగా మాట్లాడుకోవచ్చని, అయితే కోర్టు ముందు కాదన్నారు. ‘ఈ సమస్యలు న్యాయస్థానంలో చర్చనీయాంశమేనా? న్యాయమూర్తులు దీనికి శిక్షణ పొంది, అలాంటి చర్చలకు సన్నద్ధమయ్యారా?’ అని ప్రశ్నించారు. దీనిపై ఆసక్తి ఉంటే ఎంఏ, పీహెచ్డీ పూర్తి చేసి పరిశోధన చేసి అప్పుడు కోర్టుకు రావాలని పిటిషన్దారుడికి సూచించారు. పిల్ను తిరస్కరించారు.