ఎక్కడ పుట్టిపెరిగినా మన అస్తిత్వ మూలాల్ని మరచిపోవద్దంటారు. పూర్వీకుల ప్రాంతంతో కొన్ని తరాలుగా పెనవేసుకుపోయిన బంధం ఎప్పటికీ బలంగానే ఉంటుంది. మంగళూరు సోయగం పూజాహెగ్డే కూడా ఇదే మాట చెబుతున్నది. తాను పుట్టిపెరిగింది ముంబయిలో అయినా. ..తన కుటుంబం ఎదిగొచ్చిన కర్ణాటకలోని మంగళూరు ప్రాంతమంటే ఎంతో అభిమానమని తెలిపింది. ఇటీవల బెంగళూరులో ఓ అవార్డు ప్రదాన వేడుకలో పాల్గొన్న పూజాహెగ్డే కర్ణాటకపై తన ప్రేమను వ్యక్తం చేస్తూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. ఆమె మాట్లాడుతూ ‘నేను కన్నడ అమ్మాయినని గర్విస్తాను. మా కుటుంబ మూలాలన్నీ మంగళూరులోనే ఉన్నాయి. ప్రస్తుతం భారతీయ చిత్రసీమలో కన్నడ అమ్మాయిలు వెలిగిపోతున్నారు. ‘అందమైన అమ్మాయిలందరూ కర్ణాటక నుంచే వస్తున్నారు. అక్కడి నీళ్లలో ఏ మహిమ ఉందో?’ అని నన్ను చాలా మంది అడుగుతుంటారు. ఆ మాటలు వింటే కన్నడ అమ్మాయిగా గర్వంగా అనిపిస్తుంది’ అని పూజాహెగ్డే చెప్పుకొచ్చింది. మంచి స్క్రిప్ట్ దొరికితే తప్పకుండా కన్నడ సినిమాల్లో నటిస్తానని… ప్రస్తుతం అక్కడి ప్రాంతీయ సినిమా గొప్ప చిత్రాల్ని అందిస్తున్నదని కితాబిచ్చింది. ప్రస్తుతం పూజాహెగ్డే తెలుగులో ‘రాధేశ్యామ్’ ‘ఆచార్య’ చిత్రాల్లో నటిస్తున్నది. హిందీలో వరుస సినిమాలతో బిజీగా ఉంది.