హైదరాబాద్, మే 15 (నమస్తే తెలంగాణ): ఉత్పత్తి కులాలైన వృత్తి కలాలన్నీ ఏకం కావాలని తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్ పిలుపునిచ్చారు. ఆదివారం ఆయన రవీంద్రభారతిలో మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణతో కలిసి జ్వలిత సంపాదకత్వం వహించిన మల్లెసాల(శతాధిక చేతి వృత్తుల కథలు) మహా గ్రంథాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జూలూరు మాట్లాడుతూ.. బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీ వర్గాలకు సంబంధించిన జీవన వృత్తి కథలన్నీ ఇప్పుడు ఉద్ధృతంగా వెలుగులోకి వస్తున్నాయని తెలిపారు.
సమస్త వృత్తి రచనలు లేకపోతే తెలుగు సాహిత్యం పరిపుష్ఠం కాదని, అవన్నీ ఏకంగా ఉంటేనే సమాజం సమతుల్యం అవుతుందని పేర్కొన్నారు. ఇలాంటి రచనలన్నింటినీ ముద్రించి, విశ్వ సాహితీ వేదికపై నిలబెట్టే బాధ్యతను తెలంగాణ సాహిత్య అకాడమీ తీసుకొంటుందని చెప్పారు. తెలుగులో వర్గాలు, కులాలకు సంబంధించిన సాహిత్యం విరివిగా వచ్చిందని, బహుజన కులాల నుంచి వచ్చిన సాహిత్యం విప్లవాలను సృష్టించిందని మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ తెలిపారు.
గోరటి వెంకన్న రాసిన ‘పల్లె కన్నీరు పెడుతుందో’ పాట అస్తిత్వకుల ఉద్యమ సాహిత్యానికి ప్రతీకగా నిలుస్తుందన్నారు. శతాధిక చేతివృత్తుల కథల సంకలాన్ని తీసుకువచ్చిన జ్వలితను అభినందించారు. కార్యక్రమంలో ఓయూ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎస్ రఘు, ప్రముఖ రచయిత్రి గోగు శ్యామల, మేడ్చల్ జిల్లా అదనపు కలెక్టర్ ఏనుగు నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.