న్యూఢిల్లీ: ఐక్యరాజ్యసమితి పనితీరును విదేశాంగ మంత్రి జైశంకర్(Jaishankar) తప్పుపట్టారు. యునైటెడ్ నేషన్స్పై తీవ్ర విమర్శలు చేసిన ఆయన.. ఆ సంస్థ గ్రిడ్లాక్ అయ్యిందన్నారు. ఏకపక్షంగా వ్యవహరిస్తోందన్నారు. ప్రాతినిధ్యం మరిచిపోయిందన్నారు. ఉగ్రవాదం, ప్రపంచ ప్రగతిపై నిర్ణయాలు తీసుకోవడం విఫలమైన ఆ సంస్థ తన విశ్వాసాన్ని కోల్పోయినట్లు పేర్కొన్నారు. న్యూఢిల్లీలో జరిగిన యూఎన్ 80వ సంబరాల్లో పాల్గొని ఆయన ప్రసంగించారు.
ఐక్యరాజ్యసమితిలో బలమైన దేశంగా భారత్ ఉందన్నారు. కానీ ఆ ప్రపచం సంస్థ ప్రస్తుతం సంక్షోభంలో ఉందన్నారు. చట్టబద్దమైన, ప్రభావంతమైన పనితీరును వ్యవహరించడం లేదని విమర్శించారు. ఐక్యరాజ్యసమితిలో అంతా సవ్యంగా లేదన్న విషయాన్ని గ్రహించాలని జైశంకర్ తెలిపారు. ఆ సంస్థ తీసుకుంటున్న నిర్ణయాలు.. సభ్య దేశాలకు నిదర్శనంగా లేదన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సమస్యలను కూడా ఆ సంస్థ పరిష్కరించడం లేదన్నారు.
యూఎన్లో జరుగుతున్న చర్చలన్నీ ఏకపక్షంగా సాగుతున్నాయని, ఆ సంస్థ పని విధానం గ్రిడ్లాక్ అయ్యిందన్నారు. ఐక్యరాజ్యసమితిలో సంస్కరణలను నిలిపివేశారని, దానికి తోడు ఇప్పుడు ఆర్థిక సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయన్నారు. యూఎన్ భద్రతా మండలిలో మార్పులు చేయాలని, భారత్తో పాటు జపాన్, జర్మనీ, బ్రెజిల్ దేశాలకు పర్మనెంట్ సభ్యత్వాన్ని ఇవ్వాలని జైశంకర్ గుర్తు చేశారు.
ఉగ్రవాద సంస్థలపైనా కానీ, ఆ దేశాలకు అండగా ఉన్న దేశాలపై చర్యలు తీసుకోవడంలో యూఎన్ విఫలమైందన్నారు. పెహల్గామ్లో ఉగ్రదాడికి పాల్పడిన పాకిస్థాన్పై ఆంక్షలు విధించకుండా చైనా అడ్డుకుంటోందని ఆయన ఆరోపించారు.