హైదరాబాద్, నవంబర్ 14 (నమస్తే తెలంగాణ): కేంద్రం అవలంబిస్తున్న ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల వ్యతిరేక విధానాలను నిరసిస్తూ దేశవ్యాప్త సమ్మెకు ఉద్యోగులు సిద్ధం కావాలని అఖిల భారత రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య(ఏఐజీఈఎఫ్) జాతీయ అధ్యక్షుడు సుభాష్ లాంబ పిలుపునిచ్చారు. హైదరాబాద్లో నిర్వహిస్తున్న ఏఐజీఈఎఫ్ జాతీయ కార్యవర్గ సమావేశాలు ఆదివారం ముగిశాయి. కేంద్ర విధానాలపై చర్చించి దేశవ్యాప్త సమ్మెతో నిరసన తెలపాలని తీర్మానించారు. సమావేశంలో ఏఐజీఈఎఫ్ ప్రధాన కార్యదర్శి శ్రీకుమార్, టీన్జీవో కేంద్ర సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మామిళ్ల రాజేందర్, రాయికంటి ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు.