బాలీవుడ్ ప్రేమ జంటలు పెళ్లి పీటలెకడం చూస్తూనే ఉన్నాం. ఇటీవలే కత్రీనా కైఫ్, వికీ కౌశల్ వివాహ బంధంతో ఒకటయ్యారు. గత కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్న రణబీర్ కపూర్, ఆలియా భట్ కూడా పెళ్లికి సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం వీళ్లిద్దరు కలిసి ‘బ్రహ్మాస్త్ర’ సినిమా షూటింగ్లో పాల్గొంటున్నారు. మరోవైపు వాళ్ల ఇళ్లల్లో పెళ్లి పనులు ప్రారంభమైనట్లు తెలుస్తున్నది. ముందు అక్టోబర్లో వివాహం అనుకున్నా..ఇప్పుడు ముహూర్తం ఇంకాస్త ముందుకొచ్చింది. ఏప్రిల్లోనే ఈ జంట వివాహానికి ఏర్పాట్లు చేస్తున్నారట. వివాహ దుస్తుల తయారీ బాధ్యతలను వరుడి తల్లి నీతూ కపూర్ ప్రముఖ డిజైనర్ మనీష్ మల్హోత్రాకు అప్పజెప్పింది. ఆలియా, రణబీర్ తాము ప్రస్తుతం సినిమాలు చేస్తున్న దర్శకనిర్మాతల దగ్గర ఏప్రిల్లో సన్నాహాలు చేస్తున్న షెడ్యూల్ నుంచి పర్మిషన్ తీసుకుంటున్నారు. దీంతో వచ్చే నెలలో ఓ మంచి ముహూర్తానికి ఈ జంట మూడు ముళ్లతో ఒకటయ్యేలా కనిపిస్తున్నారు. ప్రస్తుతం ఈ జంట పలు సినిమాలతో బిజీగా ఉన్నారు.