మాసిన దుస్తులు.. చినిగిపోయిన బ్యాగులు.. ఇవీ గంజాయి తరలిస్తున్న వారి వేషధారణలు.. సంచార ప్రయాణికుల అవతారం ఎత్తి.. యథేచ్ఛగా ‘మత్తు’ను తరలిస్తున్నారు. మన పోలీసులకు భయపడి.. మహారాష్ట్ర అకోలా గంజాయి డాన్ ఇలా వినూత్న ఐడియాకు తెరతీసినా.. మనోళ్లు నజర్ పెట్టి.. ముగ్గురిని పట్టుకున్నారు.
తెలంగాణలో గంజాయి దందాపై పోలీసులు ఉక్కుపాదం మోపుతుండటంతో మహారాష్ట్ర స్మగ్లర్లు కొత్త దారులను వెతుకుంటున్నారు. వారి రాష్ట్రంలో గంజాయి వ్యాపారాన్ని నిర్వహించేందుకు ఏపీ నుంచి సరుకును హైదరాబాద్కు తరలించాల్సి ఉండటంతో పోలీసుల కంట పడకుండా ఉండేందుకు వినూత్నంగా ఆలోచిస్తున్నారు. తాజాగా అకోలాకు చెందిన స్మగ్లర్ పెంట్యాచౌహాన్ ఏపీ నుంచి అకోలాకు గంజాయిని తరలించేందుకు కూలీలను ఎంచుకున్నాడు. మాసిన దుస్తులు.. అక్కడక్కడ చినిగిన వస్ర్తాలు.. చేతుల్లో సంచులు వాటిపైన మొత్తం చెత్తాచెదారం కాగితాలు.. ఇలా ఎవరికీ అనుమానం రాకుండా వారి వేషధారణలు మార్చి.. అక్కడికక్కడ లారీలు, డీసీఎంలల్లో ఎక్కించి.. మహారాష్ట్రకు గంజాయిని తరలిస్తున్నాడు. వేషం మార్చి..సురక్షితంగా సరుకును చేర్చే ఆ కూలీలకు .. ఒక్కొక్కరికీ ఐదు వేల నగదును ఇస్తున్నాడు. ఈ వ్యవహారంపైనా.. సైబరాబాద్ పోలీసులు నజర్ పెట్టడంతో ముగ్గురు దొరికిపోయారు.
పెంట్యా చౌహాన్ అక్రమ గంజాయి వ్యాపారంలో ఆరితేరాడు. తెలంగాణలో పోలీసులు గంజాయి తరలించే అన్ని మార్గాలను దిగ్భందం చేయడంతో ఈ ఆలోచనకు తెరతీశాడు. ఇందుకోసం తన ప్రాంతంలో కూలీలుగా పని చేసే వారిని ఎంచుకున్నాడు. గంజాయి తరలిస్తే..ఒక ప్రయాణానికి రూ. 5 వేలు ఇస్తానని ఆఫర్ ఇవ్వడంతో వారు అంగీకరించారు. వారిని ప్రత్యేకంగా చిరిగిన అంగీలు, చీరలు, భుజాలకు చిత్తు కాగితాలు కలిగి ఉన్న బ్యాగులను ధరించేలా చేసి.. వారందరినీ రైలులో అన్నవరానికి తీసుకువచ్చేవాడు. అక్కడ గంజాయి వ్యాపారులు ప్యాకెట్లుగా మార్చిన పొట్లాలను తీసుకుని రాగానే.. తన వెంట వచ్చిన కూలీల సంచుల్లో వేసేవాడు. పైన అన్ని చిత్తు కాగితాలను పేర్చేవాడు. హైదరాబాద్ మీదుగా అకోలా తీసుకువెళ్లేవాడు. పోలీసులు పట్టుకున్నా.. తన పేరును చెప్పొద్దని పెంట్యా చౌహాన్ హూకుం జారీ చేశాడు. ఇలా స్కెచ్ వేసి.. అనేక సార్లు గంజాయిని తరలించిన పెంట్యా చౌహాన్ సైబరాబాద్ పోలీసులకు మోస్ట్ వాంటెడ్గా మారాడు.
బాలానగర్ డీసీపీ పద్మజ తెలిపిన వివరాల ప్రకారం.. పట్టుబడిన ముగ్గురు ఈ నెల 11న రాత్రి పటాన్ చెరువు ఆర్టీసీ బస్టాండ్కు గంజాయితో వచ్చారు. అక్కడే ఉన్న పోలీసులు వారి కదలికలు గమనించడంతో పసిగట్టిన పంగి మల్లేశ్, ఉషా చౌహాన్ అప్రమత్తమై..కరణ్ నానా జాదవ్, దేవ్కీ చౌహాన్, ఇందు మోహితేలతో బస్తాలను పంపించి.. మేడ్చల్ మీదుగా మహారాష్ట్రకు వెళ్లాలని సూచించారు. ఆ ముగ్గురు పటాన్చెరు నుంచి గంజాయిని తీసుకుని మేడ్చల్ మీదుగా వెళ్తుండగా, జాతీయ రహదారిలో బాలానగర్ ఎస్వోటీ పోలీసులు కాపుకాచి పట్టుకున్నారు. వారి వద్ద నుంచి 63 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితులు కరణ్ నానా జాదవ్, దేవ్కీ చౌహాన్, ఇందు మోహితేలపై మేడ్చల్ పోలీసులు కేసు నమోదు చేసి సోమవారం రిమాండ్ తరలించారు.