కథా కథనాలు బాగున్న సినిమాలను ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారని అంటున్నారు హీరో నాగార్జున. ఓటీటీలతో సినిమాలకేం ప్రమాదం లేదని, వాటి వల్ల సినిమా విస్తృతి మరింత పెరిగిందని ఆయన చెబుతున్నారు. ట్రెండ్కు తగినట్లు అప్డేట్ కావాల్సిన సమయం వచ్చిదంటున్నారాయన. నాగార్జున తాజాగా ఫాంటసీ అడ్వెంచర్ మూవీ ‘బ్రహ్మాస్త్ర’లో కీలక పాత్రలో నటించారు. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో రణబీర్ కపూర్, ఆలియా భట్ జంటగా నటించిన ఈ చిత్రం ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సినిమాకు వస్తున్న స్పందనతో పాటు చిత్ర పరిశ్రమలో పరిస్థితులపై తాజా ఇంటర్వ్యూలో మాట్లాడారు నాగార్జున.
‘బ్రహ్మాస్త్ర’లో మీ క్యారెక్టర్కు వచ్చిన ఫీడ్ బ్యాక్ ఏంటి?
ఈ సినిమాలో అనీష్ అనే పాత్రలో నటించాను. ఈ క్యారెక్టర్ ప్రేక్షకులకు నచ్చుతుందని ముందు నుంచే నమ్మకం ఉండేది. అతిథి పాత్రే, నిడివి తక్కువ ఉంటుందని అనుకున్నారు గానీ కథలో అదే కీలకంగా మారింది. నా సీన్స్ను ఎంజాయ్ చేస్తున్నారు. ముఖ్యంగా ఉత్తరాది ప్రేక్షకులు నా పాత్రను బాగా ఇష్టపడుతున్నారు.
సుదీర్ఘ విరామం తర్వాత హిందీలో నటించారు, బాలీవుడ్లో కమ్బ్యాక్ మూవీ అనుకోవచ్చా?
ఒక ఇష్టంతో హిందీ సినిమాల్లో నటిస్తుంటాను. వాళ్లతో కలిసి పనిచేయడం కొత్త అనుభవాలను ఇస్తుంది. అందుకే ‘ఖుదా గవా’, ‘అగ్ని వర్ష’ లాంటి చిత్రాల్లో నటించాను. ‘బ్రహ్మాస్త్ర’లో కూడా కొత్త ఎక్సీపిరియన్స్ దొరికింది.
‘బ్రహ్మాస్త్ర’ను మార్వెల్ మూవీస్తో పోల్చడంపై మీ స్పందన
గ్రాఫిక్స్ ఉన్నాయి కాబట్టి అలాంటి ఫీల్ కలుగుతుంది. 20 ఏళ్ల లోపు పిల్లలు సినిమాను బాగా ఎంజాయ్ చేస్తున్నారు. వాస్తవంగా మా టార్గెట్ ఆడియెన్స్ కూడా పిల్లలే. వాళ్లకు కథలో ఎలాంటి లాజిక్స్ అవసరం లేదు. సినిమా నచ్చితే చాలు ఆనందిస్తారు.
గ్రాఫిక్స్ వల్ల సినిమాల్లో సహజత్వం పోతున్నదనే విమర్శలు వస్తున్నాయి కదా
ఈ మార్పు మన దగ్గరే కాదు హాలీవుడ్లోనూ వచ్చింది. ఈ ఏడాది వచ్చిన హాలీవుడ్ మూవీస్ పరిశీలించండి. పదిశాతం కూడా మామూలు సినిమాలు ఉండవు. మన దగ్గర ‘బాహుబలి’, ‘ఆర్ఆర్ఆర్’ లాంటి చిత్రాల్లో వీఎఫ్ఎక్స్ ఉపయోగించి భారీ యాక్షన్ సీన్స్ చేశారు. అవి సహజంగా ఉండేలా చూసుకున్నారు. లేకుంటే ఆ సీన్స్ అంత గ్రాండ్గా రావు.వాళ్ల మైండ్ సెట్ మారిందనడం కంటే సినిమా నాలెడ్జ్ విస్తృతమైంది అని చెప్పుకోవాలి. ఇవాళ నేను ఇక్కడ ఉండి బెంగాళీ, జర్మన్, ఫ్రెంచ్, కొరియన్ సినిమాలు చూడగలుగుతున్నా. ప్రేక్షకులకు కూడా వైవిధ్యమైన సినిమాలు అందుబాటులోకి వచ్చాయి. ఓటీటీ వల్ల సినిమా చచ్చిపోతుందని కొందరు అంటున్నారు. నా దృష్టిలో సినిమా వ్యాప్తి పెరుగుతున్నది.
ఒకప్పటి క్రికెట్కి ఇప్పటికి తేడా ఉంది కదా. అప్పుడు ప్రశాంతంగా ఆడేవారు. ఇప్పుడు ఒక్క క్షణం అలసత్వం పనికిరాదు. పరుగులు పెట్టాల్సిందే. సినిమాల్లోనూ పోటీ పెరిగింది. బాగా లేని సినిమాలను ప్రేక్షకులు తిరస్కరిస్తున్నారంటే వాళ్లు సమయానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. బాగా లేని సినిమా కోసం థియేటర్కు వెళ్లి చూసి వచ్చేంత టైమ్ లేదు. ఫ్లాప్ సినిమా ఉచితంగా చూపించినా వాళ్లు చూడరు.
అంకెల కోసం పరుగులు పెట్టడం నేను ఎప్పుడో ఆపేశాను. కొత్త కథల్లో నటించాలి, ఎప్పటికప్పుడు అప్డేట్ అవ్వాలి అనేది చూసుకుంటా. ఈ క్రమంలో కొన్నిసార్లు ఫెయిల్ అవ్వొచ్చు కానీ ప్రయత్నం మానను. 38 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నానంటే అదే గొప్ప విజయం. ఇప్పటికీ ప్రేక్షకులు నా సినిమాలు చూస్తున్నారు. నా సినిమాలు ఎంత వసూళ్లు సాధిస్తాయో నాకు తెలుసు. ఆ పరిమితుల్లోనే సినిమాలు చేస్తాను.
కంటెంట్ బాగున్న సినిమాలకు ప్రేక్షకులు తప్పకుండా వస్తారు. కోవిడ్ సమయంలో థియేటర్లకు వచ్చేందుకు ప్రేక్షకులు భయపడ్డారు. ప్రపంచవ్యాప్తంగా సినిమాకు ఈ అనుభవం ఎదురైంది.
కొన్ని కార్పొరేట్ సంస్థలు ముందుకొస్తున్నాయి. అయితే నాన్నగారు ఏఎన్నార్ కాలం నుంచి పరిశ్రమలో ఓ పది మంది పెద్ద నిర్మాతలు ఉండేవారు. ఇప్పుడూ అలాగే ఉన్నారు. వాళ్లే రెగ్యులర్గా సినిమాలు నిర్మిస్తూ వస్తున్నారు. ఇప్పుడు గతంలోలా నిర్మాత సినిమా బాగోగులు చూసుకునే ట్రెండ్ వచ్చింది. ఉదాహారణకు ‘సీతారామం’, ‘ఒకే ఒక జీవితం’ లాంటి చిత్రాలు చెప్పుకోవచ్చు. వాళ్లు కథను నమ్మి సినిమాను రాజీ పడకుండా నిర్మించారు.
ఇద్దరు ముగ్గురు దర్శకులతో సంప్రదింపులు జరుగుతున్నాయి. కథలు వింటున్నాను. వందో సినిమా కాబట్టి ప్రతిష్టాత్మంగా చేయాలని అనుకుంటున్నా.
బాగున్న సినిమాలను ఏ ప్రచారం ఆపలేదు. ‘గంగూభాయ్’, ‘భూల్ భులయ్యా 2’, ‘ఆర్ఆర్ఆర్’ హిందీలో మంచి విజయాలు సాధించాయి. ‘లాల్ సింగ్ చద్దా’ ఆదరణ పొందలేదంటే అది బాయ్ కాట్ ట్రెండ్ వల్ల కాదు.
గత ఐదేళ్లుగా నిర్విరామంగా సినిమాలు చేస్తున్నాను. కోవిడ్ టైమ్లోనూ షూటింగ్స్ చేశాను. ఓ మూడు నెలల పాటు కొత్త సినిమా గురించి ఆలోచించకుండా విశ్రాంతి తీసుకోవాలని ఉంది.
‘ఘోస్ట్’ సినిమా ఎలా ఉండబోతుంది?
సినిమా మీద చాలా నమ్మకంగా ఉన్నాం. యాక్షన్, ఫ్యామిలీ ఎమోషన్ ఆకట్టుకుంటాయి. ఈ సినిమా కోసం గన్ ట్రైనింగ్ తీసుకున్నా. ప్రవీణ్ సత్తారు మంచి దర్శకుడు. అతని ‘గరుడ వేగ’ సినిమా చూసి ఈ దర్శకుడితో సినిమా చేయాలి అనుకున్నాను. అది ఈ సినిమాకు కుదిరింది. దుబాయ్లో చాలా కష్టపడి షూటింగ్ చేశాం. అక్కడ ఎడారిలో వేడి, ఇసుక తుఫానులు వస్తుంటాయి. ఆ పరిస్థితుల్లో అనుకున్నట్లు చిత్రీకరణ జరిపాం.
నిమిషాల్లో సినిమా రివ్యూస్ సోషల్ మీడియాలో వస్తున్నాయి. దీన్నెలా చూస్తారు?
తొలి రోజు తొలి ఆట చూసే ప్రేక్షకులంతా విమర్శకులుగానే సినిమా చూస్తారు. బాగా లేకుంటే వెంటనే ఫోన్స్ చేసి మిగతా వాళ్లకు చెబుతారు. క్రిటిక్స్ అప్పటికే రెడీగా ఉంటారు. వాళ్లను తప్పు పట్టడం లేదు. అది వాళ్ల జాబ్. అప్పట్లో ఫోన్స్, ఇంటర్నెట్ లేవు. మా సినిమాల రివ్యూస్ రావాలంటే కనీసం ఒక రోజు పట్టేది, కొన్నిసార్లు వీక్లీ మ్యాగజైన్స్ అయితే వారం రోజులు అయ్యేది. అప్పటికి మూవీ బాగుంటే థియేటర్లో ఉండేది లేకుంటే లేదు. ఇప్పుడు నేను కూడా ఐఎండీబీ రివ్యూస్ చూసే బాగుంది అనుకుంటే వెబ్ సిరీస్ చూస్తుంటాను.
మన పౌరాణిక గాథల్ని తెరపై మరో స్థాయికి తీసుకెళ్లే సమయం వచ్చిందని అనుకోవచ్చా?
ఖచ్చితంగా, ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’, ‘లార్డ్ ఆఫ్ ద రింగ్స్’ వంటి హాలీవుడ్ సినిమాల కథలన్నీ కల్పితమే. మనకు పౌరాణిక కథల అండ ఉంది. మహాభారతంలోనే ఎన్ని పాత్రలు, ఎన్నెన్ని కథలున్నాయి. వాటిని స్క్రీన్ మీదకు తీసుకొస్తే అద్భుతంగా ఉంటుంది. ఈ విషయంలో మన దర్శకులు మేల్కొన్నారు. మణిరత్నం ‘పొన్నియన్ సెల్వన్’ చేస్తున్నారు. చాలా గొప్ప కథా నేపథ్యం అది. నేను దర్శకుడిని అయితే ఆ కథను గంట నిడివి గల పది ఎపిసోడ్స్ వెబ్ సిరీస్ చేస్తా. అంత విస్తృతమైన కథ పొన్నియన్ సెల్వన్.