లక్నో: రానున్న యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో మెయిన్పురి జిల్లాలోని కర్హల్ నియోజకవర్గం నుంచి ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్ బరిలోకి దిగనున్నారు. ఈ మేరకు ఆ పార్టీ ప్రతినిధి అశుతోష్ వర్మ గురువారం వెల్లడించారు. మెయిన్పురి జిల్లా ఎస్పీకి కంచుకోట వంటిది. ఇక్కడి నుంచే పార్టీ వ్యవస్థాపకుడు, అఖిలేశ్ తండ్రి మూలాయంసింగ్ యాదవ్ ఎంపీగా ఉన్నారు. 2017లో ఎస్పీ నేత సోబ్రాన్ యాదవ్ కర్హల్ నుంచి పోటీచేసి 1.04 లక్షల ఓట్లతో గెలిచారు. బీజేపీ అభ్యర్థి ప్రేమ్ సఖ్యకు 38,405 ఓట్లు పోలయ్యాయి. మూడో విడుతలో ఫిబ్రవరి 20న కర్హల్కు ఎన్నికలు జరుగనున్నాయి. అఖిలేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడం ఇదే తొలిసారి. 2012-17 మధ్య శాసనమండలి సభ్యునిగా ఉండి సీఎంగా పనిచేశారు.