న్యూఢిల్లీ : జ్ఞాన్వాపి మసీదు వివాదం నేపధ్యంలో కాషాయ పార్టీపై ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ మంగళవారం విమర్శలు గుప్పించారు. ఎన్నికల వరకూ బీజేపీ ఇలాంటి అంశాలతో కూడిన విద్వేష క్యాలెండర్ను అమలు చేస్తుందని ఆయన మండిపడ్డారు.
జ్ఞాన్వాపి వంటి ఘటనలను బీజేపీ ఉద్దేశపూర్వకంగానే తెరపైకి తీసుకువస్తుందని ఆరోపించారు. ఆహారం, ఇంధన ధరలు భగ్గుమంటున్నాయని..ద్రవ్యోల్బణం, నిరుద్యోగంపై వారి నుంచి ఎలాంటి సమాధానం లేదని పేర్కొన్నారు. ఎన్నికల వరకూ వివాదాస్పద అంశాలను ముందుకు తెచ్చి విద్వేషాన్ని వ్యాప్తి చేయడమే పనిగా పెట్టుకున్నారని ఆరోపించారు.
పాలక పార్టీ వాస్తవ అంశాల నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు ప్రయత్నిస్తోందని అఖిలేష్ యాదవ్ అన్నారు. మనం ఇలాంటి అంశాలపై చర్చలో మునిగితేలుతుంటే దేశానికి చెందిన ఏ ఆస్తులను అమ్ముతున్నారో మనకు తెలియదని చెప్పారు. బీజేపీ ఒన్ నేషన్ ఒన్ రేషన్ నినాదం ముందుకు తెస్తున్నా ఆ పార్టీ నేతలు ఒన్ నేషన్..ఒన్ బిజినెస్మెన్ కోసం పనిచేస్తున్నట్టుగా ఉందని ఎద్దేవా చేశారు.