బహ్రైచ్: పన్నెండో తరగతి పూర్తయి ఇంటర్లో ప్రవేశం పొందే వారికి ల్యాప్ట్యాప్లు ఇస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా హామీ ఇవ్వడంపై ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్ చురకలు వేశారు. ఇంకా నయం ఇంటర్ పూర్తయి పదో తరగతి చదువుతున్నవారికి ల్యాప్ట్యాప్లు ఇస్తామనలేదని ఎద్దేవా చేశారు. 11, 12వ తరగతులను కలిపి ఇంటర్మీడియట్ అంటారన్న విషయం అమిత్ షాకు తెలియకపోవడం హాస్యాస్పదంగా ఉన్నదని చెప్పారు. బుధవారం బహ్రైచ్లో జరిగిన ఎన్నికల ప్రచార సభలో అఖిలేశ్ మాట్లాడుతూ నాలుగో విడుత పోలింగ్ ముగిసేసరికి సమాజ్వాదీ పార్టీకి 200 సీట్లు వస్తాయని పేర్కొన్నారు.
ఎస్పీకి రాష్ట్రీయ కిసాన్ మంచ్ మద్దతు
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో రైతు సంఘం రాష్ట్రీయ కిసాన్ మంచ్(ఆర్కేఎం) సమాజ్వాదీ పార్టీ(ఎస్పీ)కి సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఈ మేరకు మంచ్ జాతీయ అధ్యక్షుడు శేఖర్ దీక్షిత్ ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్కు బుధవారం లేఖ రాశారు. రైతు సంక్షేమం కోసం అధికార బీజేపీ చేసిందేమీ లేదని, ఈస్టిండియా కంపెనీ ‘విభజించు-పాలించు’ పాలసీని అనుకరిస్తూ మతం పేరుతో ప్రజల్లో విభజన సృష్టించి తిరిగి అధికారం చేపట్టాలని చూస్తున్నదని అన్నారు.