లక్నో: వచ్చే యూపీ ఎన్నికల్లో తమ పార్టీ అధికారంలోకి వస్తే.. సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ చేసిన నిరసనోద్యమంలో అమరులైన రైతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున సాయం అందిస్తామని సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ) అధ్యక్షుడు అఖిలేశ్ బుధవారం ప్రకటించారు. ఇతరుల కోసం ఆహారాన్ని పండించే రైతుల ప్రాణాలు వెలకట్టలేనివని పేర్కొన్నారు. కాగా, ఉద్యమంలో అమరులైన రైతు కుటుంబాలకు రూ. 3 లక్షల చొప్పున పరిహారం అందజేస్తామని తెలంగాణ ప్రభుత్వం ఇదివరకే ప్రకటించడం తెలిసిందే. మరోవైపు యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులపై చర్చించేందుకు ఆమ్ఆద్మీ పార్టీ (ఆప్) యూపీ ఇంచార్జ్ సంజయ్ సింగ్, అప్నాదళ్ (కే) అధ్యక్షుడు క్రిష్ణ పటేల్తో అఖిలేశ్ బుధవారం వేర్వేరుగా భేటీ అయ్యారు.