లఖింపూర్ ఖీరీ, డిసెంబర్ 15: ‘తెలివితక్కువ వాళ్లలా పిచ్చి ప్రశ్నలు వేయకండి. మీకేమైనా మతిస్థిమితం గానీ పోయిందా? మెదడు పనిచేయట్లేదా? మీరేం తెలుసుకోవాలనుకుంటున్నారు? మీరందరూ కలిసి ఒక అమాయకుడిని (ఆశిష్ మిశ్రా) దోషిగా చిత్రీకరించారు. దీనికి మీకు సిగ్గేయడం లేదా? మీరంతా దొంగలు’ – లఖింపూర్ హింసాకాండ, ఆశిష్ మిశ్రా పాత్ర, సిట్ నివేదిక గురించి బుధవారం విలేకరులు అడిగిన ప్రశ్నలకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్మిశ్రా స్పందించిన తీరిది. లఖింపూర్లోని ఓ ప్రభుత్వ ఆరోగ్యకేంద్రంలో బుధవారం ఆక్సిజన్ ప్లాంట్ను ప్రారంభించిన అజయ్మిశ్రా అనంతరం కరోనా కట్టడి చర్యల గురించి మీడియాతో మాట్లాడారు.
ఈక్రమంలో.. రైతులను వాహనాలతో తొక్కించడం ముందస్తు ప్రణాళికలో భాగంగా జరిగిన కుట్రేనని సిట్ నివేదిక మంగళవారం పేర్కొనడంపై స్పందించాలని కేంద్రమంత్రిని ఓ విలేకరి కోరారు. దీంతో సహనం కోల్పోయిన మంత్రి మీడియాపై చిందులు తొక్కారు. మంత్రి దుర్భాషలను రికార్డు చేస్తున్న విలేకరిపై మండిపడ్డారు. ఫోన్ స్విచ్ఛాఫ్ చేయాలంటూ బెదిరింపులకు పాల్పడటమే కాకుండా మొబైల్ను లాక్కున్నారు. మంత్రి ప్రవర్తనపై విలేకరులు.. డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్కు ఫిర్యాదు చేశారు.
మంత్రి రాజీనామాకు విపక్షాల పట్టు
సిట్ సమర్పించిన నివేదిక బుధవారం పార్లమెంటు ఉభయ సభలను కుదిపేసింది. రైతుల మరణానికి కారణమైన కేంద్రమంత్రి అజయ్మిశ్రాను మంత్రివర్గం నుంచి తొలగించాలని, సిట్ నివేదికపై చర్చించాలని లోక్సభలో విపక్షాలు పట్టుబట్టాయి. అటు రాజస్యసభలోనూ సిట్ నివేదిక, 12 మంది ఎంపీల సస్పెన్షన్పై నిరసనలు హోరెత్తాయి. అజయ్మిశ్రాను మంత్రిగా తొలగించాలని డిమాండ్ చేస్తూ యూపీ అసెంబ్లీ ఎదుట ఎస్పీ, కాంగ్రెస్ నేతలు నిరసనలు చేపట్టారు.