న్యూఢిల్లీ: ఢిల్లీ-మాస్కో మధ్య విమానాలను ఎయిర్ ఇండియా రద్దు చేసింది. ఢిల్లీ-మాస్కో-ఢిల్లీ మధ్య వారంలో రెండు రోజులు విమాన సర్వీసులను ఎయిర్ ఇండియా నిర్వహిస్తున్నది. అయితే ఉక్రెయిన్పై రష్యా యుద్ధం నేపథ్యంలో ఇన్సురెన్స్కు సంబంధించిన సమస్యలు తలెత్తాయి. టాటా చేతికి తిరిగి చేరిన ఎయిర్ ఇండియా అన్ని విమానాలకు ఇన్సురెన్స్ను అంతర్జాతీయ సంస్థలు నిర్వహిస్తున్నాయి. ఉక్రెయిన్పై యుద్ధం నేపథ్యంలో రష్యాపై పశ్చిమ దేశాలు ఆంక్షలు విధించాయి. తమ గగనతలాన్ని రష్యా విమానాలకు నిషేధించాయి. ప్రతిగా రష్యా కూడా పశ్చిమ దేశాల విమానాలు, గగనతలం వినియోగంపై నిషేధం విధించింది. అయితే ఎయిర్ ఇండియా మాత్రం ఇప్పటి వరకు రష్యాకు విమానాలను నడుపుతున్నది. తాజాగా ఇన్సురెన్స్కు సంబంధించిన సమస్యల వల్ల మాస్కోకు విమానాలను రద్దు చేసినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.
కాగా, ఎయిర్ ఇండియా విమానాల రద్దు విషయాన్ని రష్యా రాయబార కార్యాలయం ధృవీకరించింది. ఢిల్లీ-మాస్కో-ఢిల్లీ విమాన సర్వీసులకు టికెట్ల అమ్మకాన్ని ఎయిర్ ఇండియా నిలిపివేసినట్లు తెలిపింది. ‘ప్రియమైన పౌరులారా. భారతీయ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా ఢిల్లీ-మాస్కో-ఢిల్లీ మార్గంలో టిక్కెట్ల అమ్మకాలను నిలిపివేసిన విషయాన్ని మేం మీ దృష్టికి తెస్తున్నాం. రష్యాకు ఈ విమానయాన సంస్థ విమానాలను తిరిగి ప్రారంభించే అవకాశాలు ప్రస్తుతానికి అనిశ్చితంగా ఉన్నాయి. ఎయిర్ ఇండియా కార్యాలయం ప్రకారం, రద్దయిన విమానాలకు ప్రయాణీకులు పూర్తి వాపసు పొందేందుకు అర్హులు’ అని పేర్కొంది. అయితే తాష్కెంట్, ఇస్తాంబుల్, దుబాయ్, అబుదాబి, దోహా మీదుగా ఢిల్లీ నుంచి మాస్కోకు విమానాల్లో ప్రయాణించవచ్చని సూచించింది.