యాదాద్రి, మే 12: మాదిగ ఉపకులాల సమగ్రాభివృద్ధే టీఎమ్మార్పీస్ లక్ష్యమని ఆ సంఘం జాతీయ, రాష్ట్ర అధ్యక్షులు మేడి పాపయ్య, వంగపల్లి శ్రీనివాస్ స్పష్టంచేశారు. విద్య, ఉపాధి, ఆర్థిక, రాజకీయ రంగాల్లో జాతిని ముందుంచడం టీఎమ్మార్పీఎస్ ప్రధాన ఎజెండాగా ఉద్యమిస్తుందని వెల్లడించారు. గురువారం యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో పార్లమెంట్ స్థాయి సమావేశానికి వారు హాజరై మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం అమలుచేస్తున్న దళితబంధుతో దళితుల జీవితాలు మారుతున్నాయని పేర్కొన్నారు. మాదిగలకు వృద్ధుల పింఛన్ కింద రూ.2 వేలు ఇవ్వాలని కోరారు. గ్రామాల్లో జనాభా, ఓటు శాతం, అక్షరాస్యులు, నిరక్షరాస్యుల సమగ్ర సర్వే నిర్వహిస్తామని చెప్పారు. జాతి అభివృద్ధికి దోహదపడే అంశాలను మేధావులతో చర్చించి సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తామని వెల్లడించారు.