న్యూఢిల్లీ : ఎయిమ్స్ సర్వర్లను హ్యాకర్లు టార్గెట్ చేశారనే సమాచారంతో లక్షలాది రోగుల వ్యక్తిగత వివరాలు ప్రమాదంలో పడతాయనే ఆందోళన నెలకొంది. మొత్తం అయిదు ఎయిమ్స్ మెయిన్ సర్వర్లు టార్గెట్గా సైబర్ దాడి జరిగిందని ఇందులో చైనా హ్యాకర్ల ప్రమేయం ఉందని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. చోరీ చేసిన డేటాను డార్క్ వెబ్లో అమ్మకానికి పెట్టనున్నట్టు చెబుతున్నారు. చోరీకి గురైన ఎయిమ్స్ డేటా కోసం డార్క్ వెబ్లో 1600కుపైగా సెర్చ్లు సాగినట్టు వెల్లడైంది.
రాజకీయ నేతలు, సెలబ్రిటీలతో కూడిన వీవీఐపీల సమాచారం కూడా చోరీకి గురైన డేటాలో ఉందని సమాచారం. ఎయిమ్స్కు చెందిన ఐదు సర్వర్లు హ్యాక్ అయ్యాయని ఐఎఫ్ఎస్ఓ వర్గాలు తెలిపాయి. డేటా లీక్పై ఎఫ్ఎస్ఎల్ బృందం ప్రస్తుతం తనిఖీలు నిర్వహిస్తోంది. అయితే ఎలాంటి డేటా నష్టం జరగలేదని ఐఎఫ్ఎస్ఓ అధికారులు పేర్కొన్నారు. హ్యాకర్లు భారీ ఎత్తున డబ్బును డిమాండ్ చేసేందుకే ఈ పనికి పాల్పడి ఉంటారని దర్యాప్తు ముమ్మరం చేసిన ఐఎఫ్ఎస్ఓ వర్గాలు తెలిపాయి.
ఐఎఫ్ఎస్ఓ చేపట్టిన తొలి హ్యాకింగ్ కేసు ఇదే కావడం గమనార్హం. ఎయిమ్స్ సర్వర్లను టార్గెట్ చేసిన హ్యాకర్లు రూ . 200 కోట్లను క్రిప్టోకరెన్సీలో ఇవ్వాలని ప్రతిష్టాత్మక వైద్య సంస్ధను కోరినట్టు చెబుతున్నారు. హ్యాకింగ్తో దాదాపు మూడు, నాలుగు కోట్ల మంది రోగుల వివరాలు, డేటా గోప్యతకు ముప్పు ముంచుకొచ్చిందని బుధవారం ఉదయం అధికారులు గుర్తించారు. ఇక సర్వర్లు డౌన్ కావడంతో ఎమర్జెన్సీ, అవుట్పేషెంట్, ఇన్పేషెంట్, లేబొరేటరీ విభాగాల్లో మాన్యువల్గా విధులు చేపడుతున్నారు.