Delhi AIIMS | ఢిల్లీ ఎయిమ్స్ వైద్యులు అరుదైన ఘనతను సాధించారు. దాదాపు ఆరేళ్ల బాలికకు అనస్థీషియా ఇవ్వకుండానే నాలుగు గంటల పాటు శస్త్ర చికిత్స చేసి తలలోని కణితిని తొలగించారు. శస్త్ర చికిత్స చేసే సమయంలో తప్పనిసరిగా అనస్థీషియా ఇచ్చి చేసే వారు. బాలికకు మత్తుమందు లేకుండానే విజయవంతంగా ఆపరేషన్ చేసి కణితిని తొలగించారు. ప్రపంచ వైద్య చరిత్రలో ఇంత చిన్న వయస్సులో ఉన్న చిన్నారికి స్పృహ కోల్పోకుండా శస్త్రచికిత్స చేయడం ఇదే తొలిసారి వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. పిల్లకు శస్త్ర చికిత్స చేయడం సవాల్తో కూడకున్నదని.. ఈ సమయంలో ప్రత్యేక శ్రద్ధ అవసరమని తెలిపారు. జనవరి మొదటి వారంలో ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ నుంచి ఐదు సంవత్సరాల 10నెలల వయసున్న బాలిక ఎయిమ్స్కు వచ్చింది. బాలిక తలనొప్పి, వాంతులు తదితర సమస్యలతో బాధపడుతున్నది. బాలికకు అప్పుడప్పుడు మూర్ఛ సైతం వచ్చేది. ఈ క్రమంలో కుటుంబీకులు ఎయిమ్స్లో పరీక్షించగా.. బాలిక తలలో కణితి ఉన్నట్లు గుర్తించారు. రెండేళ్ల కిందట ఆపరేషన్ చేశారు. ఆ సమయంలో కణితిలో కొంత భాగం తలలోనే ఉండిపోయింది. మళ్లీ దాన్ని తొలగించాల్సి వచ్చింది.
అయితే, బాలిక పరిస్థితిని చూసిన ఎయిమ్స్ న్యూరో సర్జరీ విభాగం ప్రొఫెసర్ డాక్టర్ దీపక్ గుప్తా, అనస్థీషియా విభాగం డాక్టర్ మిహిర్ ప్యాండ్యాతో సహా ఏడుగురు వైద్యులతో బృందాన్ని ఏర్పాటు చేశారు. బాలిక పరిస్థితిపై వైద్యుల బృందం ఆపరేషన్ కోసం వ్యూహాన్ని సిద్ధం చేసింది. బాలికకు అనస్థీషియా ఇవ్వకుండానే శస్త్ర చికిత్స చేయాలని నిర్ణయించింది. అయితే, ఎంతో సవాల్తో కూడుకున్న నిర్ణయాన్ని తీసుకున్నారు. జనవరి 4న ఈ సర్జరీలో ఏడుగురు వైద్యుల బృందం ఆపరేషన్ కోసం సిద్ధమైంది. ఆపరేషన్ రోజున బృందంలోని పలువురు వైద్యులు బాలిక ఆరోగ్యంపై నిఘా వేయగా.. ఇతర వైద్యుల బృందం శస్త్ర చికిత్స చేశారు. మొదట బాలిక తల పుర్రెలో 16 ఇంజక్షన్లు వేశారు. అనంతరం వైద్య పరీక్షలు చేసి.. శస్త్ర చికిత్సను ప్రారంభించారు. దాదాపు నాలుగు గంటలు ఆపరేషన్ కొనసాగింది. బాలిక తల నుంచి కణితిని పూర్తిగా తొలగించారు. సర్జరీ సమయంలో చిన్నారి భయపడకుండా నవ్వుతూనే ఉండడం గమనార్హం. పలుసార్లు ఫోన్లో వీడియోలు, ఫొటోలు చూపిస్తూ భయపడకుండా ఉండేలా వైద్యులు చొరవ చూపారు. సర్జరీ అనంతరం బాలిక పూర్తిగా క్షేమంగా ఉందని.. త్వరలోనే డిశ్చార్జి చేసే అవకాశం ఉందని వైద్యులు తెలిపారు.
బాలికకు పెరిసిల్వియన్ ఇంట్రాక్సియల్ బ్రెయిన్ ట్యూమర్ వచ్చిందని.. ఇలా ఎవరికైనా వస్తుందని వైద్యులు పేర్కొన్నారు. బ్రెయిన్ ట్యూమర్తో తలనొప్పి, వాంతులు, నడవడంలో ఇబ్బంది, చేతులు పైకి లేపడం, మూర్ఛ తదితర లక్షణాలు కనిపిస్తాయని తెలిపారు. ఎవరికైనా ఇలా జరిగితే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు. ఈ లక్షణాలన్నీ బాలికలోనూ కనిపించాయి. లక్షణాలు కనిపించిన తర్వాత, పరీక్షలు జరిగాయి. రెండేళ్ల కిందట శస్త్రచికిత్స కూడా చేసి కణితిని తొలగించారు. తక్కువ వయసు ఉన్న బాలికకు శస్త్ర చికిత్స చేయడం చాలా ఛాలెంజింగ్ కేసని వైద్యులు తెలిపారు. ఏ చిన్న పొరపాటు జరిగినా చిన్నారి బాలిక ప్రాణం పోయేదని.. శస్త్రచికిత్స జరిగిన ప్రతి క్షణం శరీరంలో మార్పులు, కదలికలను శితంగా వైద్యుల బృందం పరిశీలించింది. సర్జరీ సమయంలో బాలిక ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాకపోవడం విశేషమని వైద్యులు పేర్కొంటున్నారు.