లక్నో : ఉత్తరప్రదేశ్లోని ఆగ్రా జిల్లాల్లో మద్యం సేవించి ఎనిమిది మంది మృత్యువాతపడ్డారు. తాజ్గంజ్ పరిధిలోని నాగ్లా డియోరిలో నలుగురు, దౌకిలోని కౌలారా కలాన్లో ముగ్గురు, బార్కులాలో ఒకరు మృతి చెందారు. మరణాలకు కల్తీ మద్యమే కారణమని కుటుంబీకులు, గ్రామస్తులు ఆరోపించారు. అయితే, పోలీసులు మాత్రం కేవలం ఆరు మరనాలు మాత్రమే నమోదయ్యాయని పేర్కొన్నారు. వీరిలో మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించామని, ఘటనపై విచారణకు ఆదేశించినట్లు ఎస్ఎస్పీ మునిరాజ్ పేర్కొన్నారు. దౌకి గ్రామానికి చెందిన నలుగురు కలిసి గత ఆదివారం మద్యం సేవించారు. ఆ తర్వాత వారి ఆరోగ్యం క్షీణించగా.. ఆసుప్రతిలో చికిత్స పొందుతూ సోమవారం ముగ్గురు మరణించారు. మంగళవారం మరో వ్యక్తి మరణించాడు.
అదే సమయంలో ఓ వ్యక్తికి కుటుంబీకులు దహన క్రియలు పూర్తి చేయడంతో మిగతా ముగ్గురి మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించినట్లు పోలీసులు తెలిపారు. అయితే, అతిగా తాగడం వల్లే మృతి చెందినట్లు ప్రాథమికంగా తేల్చినట్లు సమాచారం. డియోరి గ్రామంలో సోమవారం మరో నలుగురు వ్యక్తులు మరణించారు. ఇందులో ముగ్గురికి మృతదేహాలకు కుటుంబీకులు అంత్యక్రియలు నిర్వహించారు. నకిలీ మద్యం కారణంగానే ఓ వ్యక్తి మృతి చెందాడని పోలీసులు ఫిర్యాదు చేయగా.. పోలీసులు పోస్టుమార్టంకు తరలించారు. అయితే, రిపోర్టులో ఊపిరితిత్తుల వ్యాధి కారణంగా వ్యక్తి మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మరో వ్యక్తి మంగళవారం మృతి చెందగా.. పోస్టుమార్టం నిర్వహించారని, రిపోర్టు రావాల్సి ఉందని పేర్కొన్నారు.