న్యూఢిల్లీ : ఎంఎస్పీ (కనీస మద్దతు ధర) గ్యారెంటీ చట్టం, విత్తన బిల్లుకు సంబంధించిన డిమాండ్లను కేంద్రం ఆమోదించే వరకు.. ఆందోళన ఆగదని భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ) నేత రాకేశ్ తికాయిత్ స్పష్టం చేశారు. ప్రభుత్వం మాతో చర్చలు జరుపాలి, లేకుంటే మేం ఇంటికి వెళ్లమని తికాయిత్ అన్నారు. ఇప్పటికే సంయుక్త కిసాన్ మోర్చా కేంద్రం ముందు ఆరు డిమాండ్లను ఉంచింది.
కనీస మద్దతు ధరకు చట్టబద్ధమైన హామీ, లఖింపూర్ ఖేరి హింసాత్మక ఘటనలో కేంద్ర హోంశాఖ మంత్రి అజయ్ మిశ్రాను తొలగించాలని, రైతులపై పెట్టిన కేసులను ఉప సంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. రైతు ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన ఆందోళనకారులకు స్మారక చిహ్నం నిర్మించాలని, విద్యుత్ సవరణ చట్టం బిల్లును సైతం ఉపసంహరించాలని పేర్కొంటున్నారు. మూడు వివాదాస్పద చట్టాలను పార్లమెంట్లో అధికారికంగా రద్దు చేసే వరకు నిరసనకారులు స్పష్టం చేశారు.
అయితే, మోదీ నిర్ణయానికి ధన్యవాదాలు తెలుపుతూ ఎస్కేఎం ఆదివారం లేఖ రాసింది. 11 రౌండ్ల చర్చల తర్వాత.. ద్వైపాక్షిక పరిష్కారం కంటే ఏకపక్ష మార్గాన్ని ఎన్నుకున్నారని ఆరోపించింది. ఎంఎస్పీ చట్టం, విద్యుత్ బిల్లు, రైతుల కుటుంబాలకు నష్ట పరిహారం, పునరావాసం కల్పించాలని డిమాండ్ చేశారు. తమతో ప్రభుత్వం చర్చలు జరిపే వరకు ఆందోళన కొనసాగిస్తామని స్పష్టం చేసింది. గతేడాది నవంబర్ నుంచి వందలాది మంది రైతులు ఢిల్లీలోని సింగు, టిక్రి, ఘాజీపూర్ సరిహద్దుల్లో రైతులు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే.