వాషింగ్టన్, డిసెంబర్ 20: దీర్ఘకాల ఆయుష్షుతో ఆరోగ్యవంతమైన జీవితం గడుపాలని, వయసు పెరుగుదల నిలిచిపోయి నిత్య యవ్వనంగా కనిపించాలని ప్రతీ ఒక్కరు కోరుకొంటారు. ఏజింగ్ ప్రక్రియను నిలిపేసే సాంకేతికతను అభివృద్ధి చేయాలని ఇప్పటికే శాస్త్రవేత్తలు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈ క్రమంలో ఇంగ్లండ్లోని యూనివర్సిటీ ఆఫ్ లివర్పూల్ శాస్త్రవేత్తలు కీలక ప్రయోగానికి సిద్ధమయ్యారు. మనిషి కండర కణాలను అంతర్జాతీయ అంతరిక్ష పరిశోధన కేంద్రానికి (ఐఎస్ఎస్) పంపించనున్నారు. మంగళవారం స్పేస్ఎక్స్కు చెందిన ఫాల్కన్ 9 రాకెట్ ఈ కణాలను రోదసిలోకి తీసుకుపోనున్నది. గురుత్వాకర్షణ, వాతావరణం లేనటువంటి అక్కడి ల్యాబ్లో ఉంచనున్న ఈ కణాలపై విద్యుత్తు ప్రసారంతో ఉద్దీపన చర్యలు జరుపనున్నారు. నెల రోజుల అనంతరం ఆ కణాలను భూమి మీదకు తీసుకొచ్చి ‘మైక్రో ఏజింగ్’ పేరిట అధ్యయనం చేస్తారు.