అఫ్గానిస్థాన్పై ప్రాంతీయ భద్రతా సదస్సును నిర్వహించడం ద్వారా ఆసియా చిత్రపటంపై తన ప్రాధాన్యాన్ని భారత్ చాటుకున్నట్టయింది. ఈ సదస్సుకు చైనా, పాకిస్థాన్ హాజరుకాలేదు. అఫ్గానిస్థాన్ ప్రతినిధులు లేకపోవడం కూడా పెద్ద లోపమే. గతంలో అఫ్గానిస్థాన్ విషయమై జరిగిన పలు చర్చలలో అమెరికా కానీ ఇతర దేశాలు కానీ భారత్కు ప్రాధాన్యం ఇవ్వలేదు. ఇటీవలే రష్యా నేతృత్వంలో ఖతర్లో జరిగిన సమావేశానికి అమెరికా, చైనా, పాకిస్థాన్లకు ఆహ్వానం అందిందే తప్ప భారత్ను పట్టించుకోలేదు. ప్రస్తుతం ఢిల్లీలో జరిగినటువంటి ప్రాంతీయ భద్రతా సదస్సులు గతంలో రెండుసార్లు ఇరాన్లో జరిగాయి. భారత్లో గత ఏడాదే జరగాల్సింది కానీ పరిస్థితులు అనుకూలంగా లేక ఇప్పుడు జరిగింది. ఇరాన్, రష్యాతోపాటు ఏడు దేశాల ప్రతినిధులు రావడం ఇప్పటి పరిస్థితుల్లో భారత్కు అనుకూలాంశంగానే చెప్పుకోవచ్చు.
మొదటినుంచి అఫ్గానిస్థాన్లో తాలిబన్ వ్యతిరేక వైఖరిని భారత్ ప్రదర్శిస్తూ వచ్చింది. అమెరికా అనుకూల ప్రభుత్వాన్ని ఆసరాగా చేసుకొని అక్కడ అభివృద్ధి ప్రాజెక్టులను చేపట్టింది. తాలిబన్లతో ఇక ఎంతో కాలం పోరాడలేమని భావించిన అమెరికా చివరికి ఏదో మేర అవగాహనకు వచ్చి తన సేనలను ఉపసంహరించుకున్నది. అయితే తాలిబన్లతో అమెరికా సుదీర్ఘ చర్చలు సాగిస్తున్నప్పుడైనా మోదీ ప్రభుత్వం అప్రమత్తం కావలసింది. లోపాయికారిగా దౌత్యమార్గాలు నెలకొల్పుకోవడం అంతర్జాతీయ రాజకీయాలలో కొత్తేమీ కాదు. అమెరికా వైదొలిగి తాలిబన్లు అధికారం చేపట్టడంతో భారత్కు ఇప్పుడు దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు ఏడు దేశాల ప్రతినిధులు సదస్సుకు రావడానికి ఆయా దేశాల పరిస్థితులే కారణం. కారణాలు ఏవైనా ఇది భారత్కు అనుకూల పరిణామమే.
‘ప్రపంచ ఉగ్రవాదానికి అఫ్గానిస్థాన్ భూతలస్వర్గంగా మారకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపడుతాం’ అంటూ ఈ సదస్సు ఢిల్లీ డిక్లరేషన్ను విడుదల చేసింది. మహిళలూ మైనారిటీలు సహా అన్ని వర్గాలకూ ప్రభుత్వంలో ప్రాతినిధ్యం కల్పిస్తామని ప్రపంచం ముందు నమ్మబలికి.. ఆచరణలో అంతా వట్టిదేనని మరోమారు తాలిబన్లు నిరూపించుకుంటున్న నేపథ్యంలో ఈ ప్రకటనకు ఎంతో ప్రాధాన్యత ఉంది. అఫ్గానిస్థాన్లో ఇరాన్తో సౌహార్ద సంబంధాలు గల షియాలున్నారు. మరోవైపు సరిహద్దు ప్రాంతాల్లో ఉజ్బెక్, తజిక్, తుర్క్మెన్ జాతుల వారున్నారు. తాలిబన్ల మూలంగా తమ దేశాల్లో ఉగ్రవాద భావజాలం పెరుగుతుందని మధ్యాసియా దేశాలు భయపడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీ సదస్సుకు ఏడు దేశాల వారు హాజరైనప్పటికీ, వారి వ్యాఖ్యలు గమనిస్తే భారత్తో పూర్తిగా ఏకీభవించరని తెలుస్తున్నది. అన్నిదేశాలు తాలిబన్లపై ఒత్తిడి తెస్తూనే వారితో సత్సంబంధాలకు ఆరాటపడుతున్నాయి. ఈ సదస్సు ఏ మేర సఫలమైందనేది, దీనిని మొదటి మెట్టుగా చేసుకొని భారత్ అనుసరించే దౌత్యనీతిపై ఆధారపడి ఉంటుంది.