హైదరాబాద్, అక్టోబర్ 16 (నమస్తే తెలంగాణ): ఏరోస్పేస్, రక్షణ రంగంలో తెలంగాణ గణనీయ అభివృద్ధి సాధిస్తున్నది. ఈ నేపథ్యంలో ఇందుకు అవసరమైన పరిశోధనలు, పరికరాల ఉత్పత్తి కోసం నైపుణ్యం కలిగిన ఉద్యోగులను తయారు చేయాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. దీన్ని దృష్టిలో ఉంచుకొని హైదరాబాద్ శివార్లలో ఏరోస్పేస్, రక్షణ విశ్వవిద్యాలయాన్ని స్థాపించాలని ప్రభుత్వం సంకల్పించింది. తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రగతిశీలక, సానుకూల విధానాలు, ఇక్కడ కల్పిస్తున్న ప్రపంచ స్థాయి మౌలిక వసతులకు మెచ్చి గత ఏడేండ్లలో పలు దేశ, విదేశీ దిగ్గజ ఏరోస్పేస్ సంస్థలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాయి. వీటిలో బోయింగ్, లాక్హీడ్ మార్టిన్, జీఈ ఏవియేషన్, సఫ్రాన్, రాఫెల్ అడ్వాన్స్డ్ సిస్టమ్స్, ఎల్బిట్ సిస్టమ్స్ తదితర ప్రఖ్యాత గ్లోబల్ ఏరోస్పేస్ ఒరిజినల్ ఎక్విప్మెంట్ తయారీ (ఓఈఎం) సంస్థలున్నాయి. వీటితోపాటు టాటా, అదానీ గ్రూపు, కళ్యాణి గ్రూపు లాంటి ప్రముఖ భారతీయ ఏరోస్పేస్, రక్షణ రంగ సంస్థలు కూడా పరిశ్రమలను ఏర్పాటుచేశాయి. వీటికి అనుబంధ పరికరాల తయారీ కోసం పలు చిన్న, మధ్యతరహా (ఎంఎస్ఎంఈ)లు కూడా ఏర్పాటయ్యాయి. అంతేకాకుండా టీఎస్ఐఐసీ ఆధ్వర్యంలో శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపంలో ఏరోస్పేస్, రక్షణ పారును ఏర్పాటుచేసింది. రన్వే యాక్సిస్కు అవసరమయ్యే పరికరాల కోసం జీఎంఆర్ ఆధ్వర్యంలో కూడా ఏరోస్పేస్ పార్ను ఏర్పాటు చేశారు. వీటికి అవసరమైన పరికరాల తయారీ, పరిశోధనల కోసం ప్రస్తుతం బ్రిటన్, ఫ్రాన్స్, అమెరికా తదితర దేశాల్లోని విశ్వవిద్యాలయాల భాగస్వామ్యాన్ని తీసుకుంటున్నారు. అయితే రోజురోజుకూ విస్తరిస్తున్న ఈ రంగానికి ఇక్కడే నైపుణ్యంగల సిబ్బందిని తయారు చేసుకునేందుకు ఆయా విదేశీ విశ్వవిద్యాలయాల సహకారంతో ప్రత్యేకంగా హైదరాబాద్ శివార్లలో ఒక విశ్వవిద్యాలయాన్ని స్థాపించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై రాష్ట్ర అధికారులు ఇప్పటికే బ్రిటన్, ఫ్రాన్స్, అమెరికా విశ్వవిద్యాలయాలతో చర్చలు జరిపారు.
వర్సిటీ ఏర్పాటుకు ప్రణాళికలు
ఏరోస్పేస్, డిఫెన్స్ రంగంలో ప్రస్తుతం మన రాష్ట్రం బ్రిటన్, ఫ్రాన్స్, అమెరికాలోని ప్రపంచ స్థాయి విశ్వవిద్యాలయాలతో భాగస్వామ్యాన్ని కలిగివున్నది. ఈ రంగం కోసం అధునాతన నైపుణ్యం, పరిశోధన అవసరాల కోసం హైదరాబాద్లో ప్రత్యేక ఏరోస్పేస్, రక్షణ విశ్వవిద్యాలయాన్ని స్థాపించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశాము. ఇప్పటికే అధికారులు ఆ దిశగా చర్యలు చేపడుతున్నారు.
– కేటీఆర్, రాష్ట్ర పరిశ్రమలశాఖ మంత్రి