Advocate Murder | నాగర్కర్నూల్ జిల్లాలో ఓ న్యాయవాది అత్యంత దారుణంగా హత్యకు గురయ్యారు. పెంట్లవెల్లికి చెందిన ఆర్ఎంపీ వైద్యుడు, న్యాయవాది మల్లయ్య (55)పై దుండగులు పథకం ప్రకారం దాడి చేసి వేటకొడవళ్లతో నరికి చంపారు. ఈ ఘటన జిల్లాలో తీవ్ర సంచలనం సృష్టించింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మల్లయ్య పెంట్లవెల్లిలో క్లినిక్ నిర్వహిస్తూ ఆర్ఎంపీ వైద్యుడిగా, న్యాయవాదిగా జీవనం సాగిస్తున్నారు. శుక్రవారం రాత్రి ఆయన క్లినిక్లో ఉండగా ఇద్దరు మహిళలు, ఇద్దరు పురుషులు ఆరోగ్య సమస్య ఉందని చెప్పి అక్కడికి వచ్చారు. వారిని పరిశీలిస్తున్న సమయంలో ఒక్కసారిగా మల్లయ్య కళ్లలో కారం చల్లి దాడికి పాల్పడ్డారు.
అనంతరం ఆయనను క్లినిక్ నుంచి బయటకు ప్రధాన రహదారిపైకి లాక్కెళ్లి వేటకొడవళ్లతో విచక్షణారహితంగా నరికి హత్య చేశారు. తీవ్ర గాయాలతో మల్లయ్య అక్కడికక్కడే మృతిచెందారు. దాడి అనంతరం నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మల్లయ్య హత్య వెనుక భూ వివాదాలే ప్రధాన కారణమై ఉండొచ్చని పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.