న్యూఢిల్లీ, ఫిబ్రవరి 3: పలు అంతర్జాతీయ స్టాక్ సూచీలను, వివిధ దేశాల స్టాక్ సూచీలను రూపొందించి, నిర్వహించే ఎస్అండ్పీ డో జోన్స్ అదానీ గ్రూప్కు పెద్ద షాక్ ఇచ్చింది. అమెరికా హెడ్జ్ ఫండ్ హిండెన్బర్గ్ అదానీ కార్పొరేట్ గవర్నెన్స్పై చేసిన తీవ్ర ఆరోపణల నేపథ్యంలో డో జోన్స్ సైస్టెన్బిలిటీ ఇండెక్స్ నుంచి ఆ గ్రూప్ ఫ్లాగ్షిప్ కంపెనీ అదానీ ఎంటర్ప్రైజెస్ను తొలగిస్తున్నట్టు శుక్రవారం ప్రకటించింది. మూడు అదానీ గ్రూప్ సంస్థలు-అదానీ ఎంటర్ప్రైజెస్, అదానీ పోర్ట్స్, అంబూజా సిమెంట్స్పై స్వల్పకాలిక అదనపు పర్యవేక్షణా చర్యలు (ఏఎస్ఎం) చేపడుతున్నట్టు నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ వెల్లడించిన మర్నాడే డో జోన్స్ ప్రకటన వెలువడటం గమనార్హం. డో జోన్స్ సైస్టెన్బిలిటీ సూచీల్లో అదానీ ఎంటర్ప్రైజెస్ తొలగింపు ఫిబ్రవరి 7న ట్రేడింగ్ ప్రారంభమైనప్పటి నుంచి అమలులోకి వస్తుందని తెలిపింది. డోజోన్స్ ప్రకటనతో ఈ సూచీని ప్రామాణికంగా తీసుకునే అంతర్జాతీయ ఇన్వెస్టర్లు అదానీ ఎంటర్ప్రైజెస్ నుంచి వైదొలుగుతారన్న భయాలతో ఆ షేరు శుక్రవారం ఇంట్రాడేలో 30 శాతం మేర పతనమై రెండేండ్ల కనిష్ఠస్థాయి రూ.1,017 వద్దకు పడిపోయింది. తదుపరి షార్ట్ కవరింగ్ ప్రభావంతో నష్టాలను చాలావరకూ పూడ్చుకుని, స్వల్ప తగ్గుదలతో ముగిసింది.
ఈ ఇండెక్స్ ఏంటి?
ఆర్థికాభివృద్ధికి తోడ్పడుతూ, కార్పొరేట్ గవర్నెన్స్, పర్యావరణ, సామాజిక లక్ష్యాలకు అనుగుణంగా వ్యాపారాన్ని చేసే పెద్ద కంపెనీలను కార్పొరేట్ సైస్టెన్బిలిటీ అసెస్మెంట్ (సీఎస్ఏ) ద్వారా విశ్లేషించి డో జోన్స్ సైస్టెన్బిలిటీ ఇండెక్స్లో చేరుస్తారు. ఆయా కంపెనీల వ్యాపారం, మార్కెట్ విలువ, ఫ్రీ ఫ్లోట్ ఈక్విటీ (పబ్లిక్ వాటా) ఆధారంగా ఈ ఎంపిక ఉంటుంది. అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీ స్టాండర్డ్ అండ్ పూర్ (ఎస్అండ్పీ), అమెరికా మీడియా సంస్థ డో జోన్స్లు కలసి రూపొందించిందే ఈ ఇండెక్స్, వాస్తవానికి ఈ రెండు అమెరికా స్టాక్స్ కోసం రూపొందించిన డో జోన్స్ ఇండస్ట్రియల్ ఏవరేజ్ ఇండెక్స్, ఎస్అండ్పీ-500 ఇండెక్స్లు దశాబ్దాలుగా బహుళప్రాచుర్యంలో ఉన్నాయి. ఇన్వెస్టర్లు ఈ ఇండెక్స్లో ఆయా వెయిటేజీలకు అనుగుణంగా పెట్టుబడుల్ని పెంచడం, తగ్గించడం చేస్తుంటారు. ఇవి పలు రకాల ఇతర ఇండెక్స్లను కూడా ఏర్పర్చాయి. ఎస్అండ్పీ గ్లోబల్ బెంచ్మార్క్ ఇండెక్స్లో ఉన్న 2,500 కంపెనీల్లో 10 శాతం టాప్ కంపెనీలు..ఎస్అండ్పీ డోజోన్స్ సైస్టెన్బిలిటీ ఇండెక్స్లో ఉన్నాయి. తాజాగా అదానీ ఎంటర్ప్రైజెస్ను దీనిలోంచి తొలగించడంతో ఈ కంపెనీ నుంచి ఇన్వెస్టర్లు కొంతమేర పెట్టుబడుల్ని ఉపసంహరించుకునే పరిస్థితి ఏర్పడింది. 2021 ఏప్రిల్లో మరో అదానీ గ్రూప్ కంపెనీ అదానీ పోర్ట్స్ను డో జోన్స్ సైస్టెన్బిలిటీ ఇండెక్స్ నుంచి తొలగించారు. మయన్మార్ మిలటరీతో అదానీ పోర్ట్స్ వాణిజ్య సంబంధాలను ఏర్పర్చుకుందన్న ఆరోపణల నేపథ్యంలో ఈ కంపెనీ తొలగింపు జరిగింది.
రంగంలోకి కార్పొరేట్ మంత్రిత్వ శాఖ
అదానీ గ్రూపు ఆర్థిక స్థితిగతులపై ఆరా తీయడానికి కార్పొరేట్ వ్యవహరాల మంత్రిత్వ శాఖ సిద్ధమైంది. గత కొన్ని సంవత్సరాలుగా అదానీ గ్రూపునకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలపై ప్రాథమిక సమీక్ష నిర్వహించనున్నట్లు ప్రభుత్వ ఉన్నతాధికారులు వెల్లడించారు. అదానీ అవకతవకలపై దేశీయ మార్కెట్ నియంత్రణ మండలి సెబీ విచారణను ప్రారంభించింది.
రెండేండ్లుగా తగ్గాయి: బీవోబీ
గడిచిన రెండేండ్లుగా అదానీ గ్రూపునకు రుణాలు తగ్గించుకుంటు వచ్చామని, ఇచ్చిన రుణాలపై ఎలాంటి ఆందోళన లేదని బీవోబీ ఎండీ, సీఈవో సంజీవ్ చద్దా స్పష్టంచేశారు. లార్జ్ ఎక్స్పోజర్ ఫ్రేమ్వర్క్(ఎల్ఈఎఫ్)లో భాగంగా సింగిల్ గ్రూపునకు అత్యధికంగా రుణాలు ఇచ్చినట్లు చెప్పిన ఆయన..ఎంతమేర ఇచ్చిందో మాత్రం వెల్లడించలేదు. అదానీ గ్రూపు అప్పుల్లో 30 శాతం రుణాలు బ్యాంకులు, ఆర్థిక సేవల సంస్థలు ఇచ్చిన విషయం తెలిసిందే. గడిచిన రెండేండ్లుగా రుణాల వాటాలను తగ్గించుకుంటూ వచ్చామని ఆర్థిక ఫలితాల విడుదల సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన చెప్పారు. ఈ రుణాలపై ఎలాంటి ఆందోళన లేదని.. గ్రూపు నుంచి రుణాలను రిఫైనాన్స్ చేయమని ఎలాంటి అభ్యర్థన రాలేదని ఆయన స్పష్టంచేశారు.
రికార్డు లాభాలు
దేశీయ బ్యాంకింగ్ దిగ్గజాల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా(బీవోబీ) రికార్డు స్థాయి లాభాలను ఆర్జించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికానికిగాను రూ.4,305 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించింది. అంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన లాభంతో పోలిస్తే 74 శాతం అధికమని పేర్కొంది. బ్యాంక్ చరిత్రలో ఒక త్రైమాసికంలో ఇంతటి స్థాయిలో లాభాలను ఆర్జించడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఏకీకృత విషయానికి వస్తే ఏడాది ప్రాతిపదికన 75 శాతం ఎగబాకి రూ.3,853 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసుకున్నది. మొండి బకాయిలు తగ్గుముఖం పట్టడం, వడ్డీల మీద వచ్చే ఆదాయం పెరగడం వల్లనే రికార్డు స్థాయి లాభాలను గడించినట్లు బ్యాంక్ ఎండీ, సీఈవో సంజీవ్ చద్దా తెలిపారు.