హైదరాబాద్ : సినీ నటి సమంతకు ఊరట లభించింది. తన ప్రతిష్టను దెబ్బతీసేలా వ్యవహరించిన యూట్యూబ్ చానెళ్లపై చర్యలు తీసుకోవాలని కూకట్పల్లి కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. మంగళవారం సమంత పిటిషన్ను కోర్టు మరోసారి విచారించిన ధర్మాసనం తుది తీర్పును వెలువరించింది. సమంతకు సంబంధించిన వీడియోలు తొలగించాలని ఆదేశించింది. అలాగే పోస్టు చేసిన వీడియోలకు సంబంధించి లింకులను సైతం యూట్యూబ్ చానెళ్లు తొలగించాలని.. రెండు యూట్యూబ్ చానెళ్లతో పాటు సీఎల్ వెంకట్రావ్ను కోర్టు ఆదేశించింది.
ఇటీవల అక్కినేని నాగచైతన్యతో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత తన విడాకుల విషయంలో రెండు యూట్యూబ్ ఛానళ్లు తన పరువుకు భంగం కలిగించేలా పోస్టులు పెట్టారంటూ సమంత కూకట్పల్లి కోర్టును ఆశ్రయించారు. యూట్యూబ్ ఛానెళ్లపై వెంటనే చర్యలు తీసుకోవాలని సమంత తన పిటిషన్లో కోరారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు.. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా తన వ్యక్తిగత వివరాలను సమంత సోషల్ మీడియాలో పోస్ట్ చేయొద్దన్న న్యాయస్థానం.. వ్యక్తిగత వివరాలను ఎవరూ ప్రసారం చేయడానికి వీల్లేదని స్పష్టం చేసింది.