తిరువనంతపురం: బీజేపీలో చేరికలు జోరుగా కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు పశ్చిమ బెంగాల్లో చేరికలు కొనసాగగా.. ఇప్పుడు కేరళ వంతైంది. ఇక్కడ కేంద్ర మంత్రి అమిత్షా పర్యటిస్తున్నారు. ఉదయం తమిళనాడులో పర్యటించి పలు ర్యాలీల్లో పాల్గొన్న అమిత్షా.. ప్రస్తుతం కేరళ ప్రచారంలో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా ఆయన సమక్షంలో పలువురు కాషాయ కండువా కప్పుకున్నారు.
తిరువనంతపురంలో బీజేపీ ఆధ్వర్యంలో చేపట్టిన కేరళ విజయ యాత్రలో కేంద్ర హోంమంత్రి అమిత్షా పాల్గొన్నారు. త్రివేండ్లంలో పార్టీ చేపట్టిన ర్యాలీకి హాజరై కార్యకర్తలను ఉత్సాహపరిచారు. అనంతరం శంఖుముఖం బీచ్లో నిర్వహించిన బహిరంగసభలో ఆయన సమక్షంలో ప్రముక నటుడు దేవన్ బీజేపీ కండువా కప్పుకున్నారు. త్రిస్సూర్లో జన్మించని దేవన్ పూర్తిపేరు దేవన్ శ్రీనివాసన్. బుల్లితెర నటుడిగా ఆరంగేట్రం చేసిన దేవన్.. పలు సినిమాల్లో నటించడమేకాకుండా నిర్మాతగా పలు సినిమాలను తెరకెక్కించారు. మళయాలంతో పాటు కన్నడ, తెలుగు సినిమాల్లో కూడా నటించి మంచి పేరు సంపాదించుకున్నారు. కాలేజీ రోజుల్లో కాంగ్రెస్ అభిమానిగా ఉన్న దేవన్.. అనంతర కాలంలో కేరళ పీపుల్స్ పార్టీని స్థాపించారు. ప్రస్తుతం కేరళ అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతున్న సమయంలో దేవన్ బీజేపీలో చేరడం తమకు లాభిస్తుందని పలువురు బీజేపీ నాయకులు చెప్తున్నారు. ఈ సందర్భంగా కేరళ బీజేపీలో ఇటీవల చేరిన మెట్రో శ్రీధరన్ మాట్లాడుతూ.. బీజేపీ ఒక్కటే కేరళను కాపాడుతుందని భావిస్తున్నట్లు చెప్పారు. తాను ఎన్నో ప్రాజెక్టులను విజయవంతంగా పూర్తిచేశానని, ఇప్పుడు కేరళ అభివృద్ధిని కాంక్షించి బీజేపీలో చేరానని శ్రీధరన్ స్పష్టంచేశారు.