ABG Fraud | గుజరాత్లోని ఏబీజీ షిప్యార్డ్ సంస్థ.. పెట్టుబడుల కోసం బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను ఇతర అనుబంధ సంస్థలకు మళ్లించారని కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ వర్గాలు తెలిపాయి. రమారమీ 28 అనుబంధ సంస్థలకు మళ్లించారని సమాచారం. బ్యాంకుల రుణాలు, నిధులు విదేశాల్లోని అనుబంధ సంస్థల్లో పెట్టుబడులుగా పెట్టారని తెలుస్తున్నది. తమ అనుబంధ సంస్థలు, వ్యక్తుల ఆధ్వర్యంలో భారీగా ఆస్తులు కొనుగోలు చేసినట్లు విశ్వసనీయ సమాచారం. ఎస్బీఐతో 2001 నుంచి ఏబీజీ షిప్యార్డ్ లావాదేవీలు నిర్వహిస్తున్నది.
రుణ వాయిదాలు సకాలంలో చెల్లించకపోవడంతో 2013 నవంబర్ 30న షిప్యార్డ్ రుణాన్ని ఎస్బీఐ మొండి బకాయిగా ప్రకటించింది. దీనిపై దర్యాప్తునకు సీబీఐకి ఎస్బీఐ ఫిర్యాదు చేసింది. ఈ బకాయి మొత్తం రూ.22,842 కోట్లు. 2005-12 మధ్య ఐసీఐసీఐ బ్యాంకు సారధ్యంలోని 28 బ్యాంకుల కన్సార్టియం ఈ రుణాలు మంజూరు చేశాయి. సీడీఆర్ వ్యవస్థ కింద 2014 మార్చి 27న ఈ రుణాన్ని పునర్వ్యవస్థీకరించినా కంపెనీ కార్యకలాపాలు పునరుద్ధరించలేదు.
ఏబీజీ షిప్యార్డ్ స్టాక్ అడిట్ జరిపేందుకు 2014 సెప్టెంబర్ 10న ఎన్వీ దండ్ అండ్ అసోసియేట్స్ను నియమించింది. 2016 ఏప్రిల్ 30న సంస్థ నివేదిక సమర్పించింది. దీని ప్రకారం కంపెనీ లావాదేవీల్లో పలు లోపాలు ఉన్నాయని నిర్ధారించింది. 2013 నవంబర్ 30 నుంచి అమల్లోకి వచ్చేలా 2016 జూలై 30న షిప్యార్డ్ రుణాన్ని మొండి బకాయిగా ప్రకటించాయి బ్యాంకులు.
2018 ఏప్రిల్ 10న జరిగిన బ్యాంకుల కన్సార్టియం ఉమ్మడి సమావేశంలో ఏబీజీ షిప్యార్డ్ లావాదేవీల్లో ఫోరెన్సిక్ అడిట్ జరుపడానికి ఎర్న్స్ట్ అండ్ యంగ్ ఎల్ఎల్పీని నియమించాయి. దీనిపై సదరు సంస్థ దర్యాప్తు జరుపడానికి నాలుగేండ్లు పట్టింది. 2012-17 మధ్యకాలంలో ఏబీజీ షిప్యార్డ్ కార్యకలాపాలపై ఎర్న్స్ట్ అండ్ యంగ్ నివేదిక సమర్పించింది. ఇదిలా ఉంటే కార్పొరేట్ దివాళా ప్రక్రియ చేపట్టాలని 2017 ఆగస్టు ఒకటో తేదీన ఐసీఐసీఐ ప్రతిపాదించింది. ప్రస్తుతం ఈ కేసు ఎన్సీఎల్టీ అహ్మదాబాద్ శాఖ వద్ద విచారణలో ఉంది. ఏబీజీ షిప్యార్డ్కు 28 బ్యాంకుల కన్సార్టియం వివిధ రకాల రుణాలు మంజూరు చేసింది. సీసీ లోన్, టర్మ్ లోన్, లెటర్స్ ఆఫ్ క్రెడిట్, బ్యాంకు గ్యారంటీస్ తదితర రూపాల్లో బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలపై దర్యాప్తు సాగుతుంది.