హైదరాబాద్, ఆట ప్రతినిధి: జాతీయ టేబుల్ టెన్నిస్ చాంపియన్షిప్లో విజేతగా నిలిచిన తొలి తెలంగాణ యువ ప్యాడ్లర్ ఆకుల శ్రీజకు తగిన గుర్తింపు లభించింది. జాతీయ యవనికపై రాష్ట్ర ఖ్యాతిని ఇనుమడింపజేసిన శ్రీజకు తెలంగాణ టేబుల్ టెన్నిస్ అసోసియేషన్(టీఎస్టీటీఏ) ఆర్థిక ప్రోత్సా హం అందించింది. శనివారం ఎల్బీ స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్.. శ్రీజకు రూ.2 లక్షల చెక్ అందించారు.
ఈ యువ ప్యాడ్లర్కు కోచ్గా వ్యవహరించిన సోమ్నాథ్ ఘోష్కు రూ.50 వేల నగదు ప్రోత్సాహం ఇచ్చారు. దీంతో పాటు రంగారెడ్డి జిల్లా మాజీ అధ్యక్షుడు, దివంగత సుదర్శన్రెడ్డి తరఫున శ్రీజకు రూ.50 వేలు బహుమతి అందజేయగా, పారా జాతీయ టీటీ విజేత హితేశ్ను మంత్రి శ్రీనివాస్గౌడ్ సత్కరించారు. రాష్ట్రంలో ప్రతిభ కల్గిన ప్లేయర్లకు తగిన గుర్తింపు ఉంటుందని ఈ సందర్భంగా మంత్రి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సాట్స్ చైర్మన్ వెంకటేశ్వర్రెడ్డి, ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, టీఎస్టీటీఏ అధ్యక్షుడు నరసింహారెడ్డి, కార్యదర్శి ప్రకాశ్రాజ్ తదితరులు పాల్గొన్నారు.