తిరుపతి : ఓ సైకో భర్త తన భార్య పట్ల క్రూరంగా ప్రవర్తించాడు. పెళ్లైన ఐదు నెలలకే చిత్రహింసలకు గురి చేశాడు. అమ్మాయిలను వేధించడం అలవాటుగా మారిన అతనికి.. భార్యను కూడా వేధిస్తూ పైశాచిక ఆనందం పొందాడు. చివరకు భార్యను చంపి చెరువులో పడేసి.. ఏమీ తెలియనట్లు ఐదు నెలల పాటు కాలం గడిపాడు. ఈ ఘటన తిరుపతిలో వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళ్తే.. సాఫ్ట్వేర్ ఉద్యోగి వేణుగోపాల్కు, తిరుపతిలోని కొర్లగుంటకు చెందిన పద్మతో 2019లో వివాహం జరిగింది. వివాహం అయ్యాక కొద్ది రోజులు బాగానే ఉన్నారు. నాలుగు నెలల తర్వాత భార్యభర్తల మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి. పద్మను గోపాల్ వేధించడం, మానసికంగా హింసించడం మొదలుపెట్టాడు. దీంతో ఆమె తల్లిదండ్రులు వేణుగోపాల్కు సర్దిచెప్పి మళ్లీ బిడ్డను కాపురానికి పంపించారు. అయినప్పటికీ వేణుగోపాల్ ప్రవర్తనలో మార్పు రాలేదు. మళ్లీ పద్మ తన పుట్టింటికి వచ్చింది. ఈ ఏడాది జనవరిలో మళ్లీ పంచాయతీ పెట్టారు. ఇక నుంచి మంచిగా చూసుకుంటానని నమ్మబలికిన వేణుగోపాల్.. పద్మను తన వెంట తీసుకెళ్లాడు.
పద్మను తన వెంట తీసుకెళ్లిన వేణుగోపాల్ అత్యంత దారుణానికి పాల్పడ్డాడు. అర గంటకే ఆమెను చంపి, గోనె సంచిలో చుట్టేశాడు. అనంతరం తిరుపతికి నాలుగైదు కిలోమీటర్ల దూరంలోని వెంకటాపురం చేపల చెరువులో పడేశాడు. అయితే పద్మ క్షేమంగానే ఉందనే ఆమె తల్లిదండ్రులు చెబుతూ వచ్చాడు. కానీ ఈ ఘోరం ఐదు నెలల తర్వాత వెలుగు చూడటంతో పద్మ పేరెంట్స్ షాక్కు గురయ్యారు.
పద్మ వివాహ సమయంలో కట్నం కింద రూ. 20 లక్షల నగదు, 45 సవర్ల బంగారం ఇచ్చినట్లు ఆమె తండ్రి పేర్కొన్నాడు. బంగారాన్ని మొత్తం అమ్మేసి పద్మను వేధించాడని తండ్రి బోరున విలపించాడు. వేణుగోపాల్ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశాడు.
సాఫ్ట్వేర్ ఇంజినీర్ వేణుగోపాల్పై గతంలోనూ రెండు కేసులు నమోదు అయ్యాయి. హైదరాబాద్లో ఇద్దరమ్మాయిలను లైంగికంగా వేధించినట్లు కేసులు నమోదైనట్లు పోలీసులు వెల్లడించారు. చెన్నైలోనూ అతనిపై కేసులు ఉన్నట్లు సమాచారం.
జాబ్ చేసుకోనివ్వకుండా టార్చర్ పెట్టింది. కాపురానికి రానంది. విడాకులు ఇవ్వాలని కోరాను. కట్నం కింద ఇచ్చిన డబ్బులు తిరిగి ఇస్తానని చెప్పాను. కట్నం డబ్బు కంటే ఎక్కువ కావాలని పద్మ ఆశ పడింది. దీంతో చిత్తూరు, మంగళగిరితో పాటు పలు మహిళా పోలీసు స్టేషన్లలో ఫిర్యాదు చేసింది. అందుకే పద్మను కొట్టి చంపి, చెరువులో పడేశాను అని వేణుగోపాల్ మీడియాకు వెల్లడించారు.