భారతదేశవ్యాప్తంగా హోలీని ప్రజలంతా ఆనందంగా జరుపుకుంటారు. హోలీ అంటే రంగుల పండుగ లేదా వసంతోత్సవం. రాధాకృష్ణుల ప్రేమకు గుర్తుగా ఈ పండుగను నిర్వహించుకుంటాం. ఇది సాధారణంగా శీతాకాలం చివర్లో, ఫిబ్రవరి లేదా మార్చి నెలల తదుపరి వారాల్లో వచ్చే చివరి ఫాల్గుణమాసం, పౌర్ణమి రోజున జరుపుకుంటారు. అయితే, మహారాష్ట్రలోని ఓ గ్రామంలో హోలీ రోజు ఓ వింత ఆచారాన్ని పాటిస్తారు. ఆ ఊరి కొత్త అల్లుడిని గాడిదనెక్కించి ఊరేగిస్తారు. అనంతరం అతడు కోరిన కొత్త బట్టలు పెడతారు.
మహారాష్ట్రలోని బీడ్ జిల్లాలోగల విదా గ్రామంలో 90 ఏళ్ల నుంచి ఈ వింత ఆచారాన్ని పాటిస్తున్నారట. గ్రామంలో కొత్త అల్లుళ్లు ఎవరెవరున్నారో తెలుసుకునేందుకు మూడు, నాలుగురోజులు ఇంటింటా సర్వే చేస్తారు. హోలీరోజు కొత్త అల్లుళ్లు తప్పించుకోకుండా గట్టి నిఘా కూడా పెడతారు. ఈ ఆచారాన్ని అదే గ్రామానికి చెందిన ఆనంద్రావు దేశ్ముఖ్ ప్రారంభించారు.
మొదట ఆనంద్రావు అల్లుడినే గాడిద ఎక్కించి ఊరేగింపు నిర్వహించారు. అనంతరం కొత్తబట్టలు పెట్టారు. అప్పటినుంచీ ఈ ఆచారం కొనసాగుతున్నది. కొత్ల అల్లుడిని గాడిదపై కూర్చోబెట్టి ఊరి మధ్యలోంచి హనుమాన్ గుడివరకు ఊరేగిస్తారు. ఈ ఊరేగింపు ఉదయం 11 గంటల వరకు ముగుస్తుంది. అనంతరం ఆ కొత్త అల్లుడు కోరిన బట్టలు పెడుతారు.