మేడ్చల్ కలెక్టరేట్, డిసెంబర్ 10 : స్వచ్ఛత అందరి బాధ్యత అని నాగారం మున్సిపాలిటీ చైర్మన్ చంద్రారెడ్డి పేర్కొన్నారు. మున్సిపాలిటీ కార్యాలయ సమావేశ మందిరంలో శుక్రవారం స్వచ్ఛతపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చెత్త పేరుకుపోతే అనారోగ్యం పాలవుతామని, వెనువెంటనే తొలగించాలని సూచించారు. మున్సిపాలిటీ ఆధ్వర్యంలో స్వచ్ఛత కోసం తీసుకుంటున్న చర్యలకు ప్రజలు సహకరించాలని కోరారు. ఇంటింటికీ చెత్త సేకరణకు వచ్చే కార్మికులకు విధిగా తడి, పొడి చెత్తను వేర్వేరుగా అందజేయాలన్నారు.
75 మైక్రాన్ల కన్నా తక్కువ ఉన్న సింగిల్ యూజ్ ప్లాస్టిక్ను వాడరాదని సూచించారు. కౌన్సిలర్లు తమ వార్డు పరిధిలోని స్వచ్ఛతపై విస్తృతంగా అవగాహన కల్పించి, పాటించేలా చూడాలన్నారు. కార్యక్రమంలో కమిషనర్ వాణిరెడ్డి, స్వచ్ఛ సర్వేక్షణ్ అధికారి బషీర్, వైస్ చైర్మన్, కౌన్సిలర్లు పాల్గొన్నారు.