వెంగళరావునగర్, నవంబర్ 24: వరదనీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు పనులు చేపట్టామని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ అన్నారు. బుధవారం సోమాజిగూడ డివిజన్ నాగార్జుననగర్ కాలనీలో రూ.30.60 లక్షల వ్యయంతో వరద నీటి పైపులైన్ శంకుస్థాపన పనులను ఆయన ప్రారంభించారు. అనంతరం విజయ టవర్స్ అపార్ట్మెంట్ అసోసియేషన్ సభ్యులు ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరదలు వచ్చినప్పుడు కాలనీ ముంపునకు గురవకుండా ఉండేందుకు పనులు చేపట్టామన్నారు. డ్రైనేజీ పనుల కోసం రూ.50 లక్షలు నిధులు మంజూరు చేశామన్నారు.
డ్రైనేజీ పనులు ప్రారంభించలేదని స్థానికులు ఎమ్మెల్యే దృష్టికి తేగా, ఆయన వెంటనే జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ రవికిరణ్తో ఫోన్లో మాట్లాడారు. రోడ్డు తవ్వేందుకు అనుమతుల రాకపోవడంతో పనుల్లో జాప్యం జరిగిందని, రెండు, మూడు రోజుల్లో పనులు చేపడ్తామని కమిషనర్ ఎమ్మెల్యేకు చెప్పినట్లు ఆయన తెలిపారు. సోమాజిగూడ డివిజన్ను ప్రగతిపథంలో నడిపేందుకు కృషి చేస్తానని సోమాజిగూడ కార్పొరేటర్ వనం సంగీత శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. కార్యక్రమంలో అధికారులు, కాలనీ సంక్షేమ సంఘం నాయకులు, విజయ టవర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు పద్మరాజు, సెక్రటరీ ప్రసాద్, డివిజన్ అధ్యక్షుడు అప్పుఖాన్, ప్రధాన కార్యదర్శి మధుయాదవ్, నాయకులు తన్ను ఖాన్, శరత్ గౌడ్, నాగమణి, రాణి, కవిత పాల్గొన్నారు.