యైటింక్లయిన్కాలనీ నవంబర్ 9 : ప్రేమను నిరాకరించిందని ఓ ఉన్మాది యువతి గొంతుకోసి దారుణంగా చంపేశాడు. ఈ ఘటన పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం వెంకట్రావుపల్లి పరిధిలోని కేకేనగర్లో మంగళవారం చోటుచేసుకొన్నది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకా రాం.. కేకేనగర్కు చెందిన గొడుగు లక్ష్మి భర్త పదేండ్ల క్రితం చనిపోగా కూతురు అంజలీదేవి (21)తో కలిసి కూలి పని చేసుకుంటూ జీవిస్తున్నది. రామగుండం కార్పొరేషన్ లోని 15వ డివిజన్ పరిధిలోని తారకరామానగర్కు చెందిన ట్రాక్టర్ డ్రైవర్ చాట్ల రాజు ప్రేమిస్తున్నానంటూ రెండేండ్లుగా అంజలీదేవిని వేధిస్తున్నాడు.
ఈ విషయంపై గతంలో పెద్ద మనుషుల సమక్షంలో పంచాయితీ కూడా జరిగింది. తీరుమార్చుకోని రాజు ఇటీవల మళ్లీ ఆమెపై వేధింపులకు పాల్పడుతున్నాడు. మంగళవారం అంజలీదేవి ఇంటికొచ్చిన రాజు.. తనను ప్రేమించాలని ఒత్తిడి చేశాడు. ఆమె నిరాకరించడంతో ఇంట్లోని కత్తిపీటతో మెడపై కోసి పారిపోయాడు. మధ్యాహ్న సమయంలో అదే కాలనీకి చెందిన బోగె వెంకటేశ్.. అంజలీదేవికి ఎంప్లాయిమెంటు కార్డు ఇవ్వడానికి రాగా డోరు వేసి ఉన్నది. ఎంత పిలిచినా బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చి చుట్టుపక్కల వారికి సమాచారం ఇచ్చాడు. వారు ఇంట్లోకి వెళ్లి చూడగా అంజలీదేవి రక్తపు మడుగులో విగతజీవిగా కన్పించింది. గోదావరిఖని టూటౌన్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారించారు. పెద్దపల్లి డీసీపీ రవీందర్, గోదావరిఖని ఏసీపీ గిరిప్రసాద్ ఘటనాస్థలిని పరిశీలించారు. యువతి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.